అజిత్ వాడేకర్ (1971)
ఇంగ్లీషు గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం వాడేకర్ నాయకత్వంలోనే తొలిసారి దక్కింది. 1971, జనవరిలో జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన అతడు తన తొలి ఎనిమిది టెస్టులను విదేశాల్లోనే ఆడాల్సి వచ్చింది. మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్లో అడుగుపెట్టగా తొలి రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కానీ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బీఎస్ చంద్రశేఖర్ తన స్పిన్ మ్యాజిక్తో 38 పరుగులకు ఆరు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 101 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు రెండో ఇన్నింగ్స్లో వాడేకర్ (45 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కపిల్ దేవ్ (1986)
1986లో భారత్ రెండోసారి సిరీస్ దక్కించుకుంది. డేవిడ్ గోవర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్.. గూచ్, గ్యాటింగ్, లాంబ్, ప్రింగిల్, ఎంబురే, ఎడ్మండ్ లాంటి స్టార్ ప్లేయర్లతో సూపర్ ఫామ్లో ఉంది. అయితే, కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా కూడా అద్భుత ప్రదర్శన చేసింది. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో చేతన్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ కపిల్ (4/52) అద్భుత ప్రదర్శన చేశాడు. టాప్ ఆర్డర్లో గూచ్, రాబిన్సన్, గోవర్లను 35 పరుగులకే పెవిలియన్కు చేర్చాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కపిల్ దేవ్ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించడంతో జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. రెండో టెస్టుకు గ్యాటింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్పై 279 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చివరి టెస్టు డ్రాగా ముగిసింది.
సౌరవ్ గంగూలీ (2002)
నాట్వెస్ట్ వన్డే సిరీస్ను దక్కించుకున్న అనంతరం టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడింది. గంగూలీ నాయకత్వంలో సెహ్వాగ్, హర్భజన్, జహీర్ ఖాన్లు ఈ పర్యటనలో చెలరేగారు. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో ఓడినా విదేశాల్లో చిరస్మరణీయ టెస్టు విజయాన్ని లీడ్స్ (మూడో టెస్టు)లో సాధించింది. వాతావరణం మేఘావృతం అయినప్పటికీ ముందుగా బ్యాటింగ్కు దిగాలని గంగూలీ తీసుకున్న దూకుడు నిర్ణయాన్ని జట్టు ఆటగాళ్లు సవాల్గా తీసుకున్నారు. ఈ టెస్టులో దాదా 128, సచిన్ 193, ద్రావిడ్ 148 రన్స్ చేయడంతో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. కాగా, 2వ, 4వ టెస్టులు డ్రాగా ముగిశాయి.
రాహుల్ ద్రవిడ్ (2007)
వెస్టిండిస్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన చేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోని టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లీషు గడ్డపై అడుగుపెట్టింది. అయితే అద్భుత పోరాటాన్ని ప్రదర్శిస్తూ ఈ జట్టు 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. మూడు టెస్టుల సిరిస్లో రాహుల్ ద్రవిడ్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసినా పేసర్ జహీర్ చెలరేగాడు. రెండోటెస్టులో బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ మొత్తం తొమ్మిది వికెట్లు తీశాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలి, మూడో టెస్టు డ్రాగా ముగిశాయి.