న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్ను రెండో టెస్ట్లో ఆడించకపోవడం దారుణమని, బాధతో కన్నీళ్లు వచ్చాయని అతని చిన్ననాటి కోచ్ కపిల్ పాండే అన్నాడు. తొలి టెస్ట్లో 8 వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ను కాదని 12 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్కు అవకాశం ఇచ్చారు. రెండో టెస్ట్ పిచ్ పేస్కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. కానీ పిచ్ మాత్రం స్పిన్కు అనుకూలించింది. దాంతో కావాలనే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టారని, గుజరాత్ ప్లేయర్ అయిన ఉనాద్కత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
తాజాగా ఈ వివాదంపై కుల్దీప్ కోచ్ కపిల్ పాండే మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని పక్కనబెట్టడంతో తాను ఏడ్చానని, అసలు కుల్దీప్ కే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నాడు. 'కుల్దీప్ యాదవ్ చాలాకాలంగా జట్టులో చోటు దక్కించుకోని బెంచ్కే పరిమితం అవుతున్నాడు. అడపాదడపా అవకాశాలిచ్చినా దానిని సద్వినియోగం చేసుకున్నా... కీలక మ్యాచ్ల్లో అతన్ని పక్కనబెడుతున్నారు. కుల్దీప్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. వన్డేల్లో అతనికి రెండు హ్యాట్రిక్ (ఇండియా ఏ, అండర్ -19 జట్టుకు ఆడినప్పుడు)లు ఉన్నాయి. అయినా టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు.
ఇక బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ లో అత్యద్భుత ప్రదర్శనతో కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. కానీ స్పిన్ కు అనుకూలించే పిచ్ పై మాత్రం అతడిని తప్పించడం బాదేసింది. నాకైతే కుల్దీప్ ను ఎలా ఓదార్చోలా కూడా తెలియలేదు. నేనొక్కడినే చాలాసేపు ఏడ్చాను. అయితే తనను తుది జట్టులో తీసుకోకపోవడంపై కుల్దీప్ స్పందిస్తూ ఇచ్చిన సమాధానం అతడి పరిణితిని తెలిపింది. గతంతో పోలిస్తే కుల్దీప్ లో పరిణితి బాగా పెరిగింది..' అని చెప్పుకొచ్చాడు.