కేస్ భరత్ సెంచరీతో..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు.. కెప్టెన్ భరత్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అతనికి తోడుగా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో సాధారణ స్కోర్కే పరిమితమైంది. భరత్ తర్వాత టెయిలండర్ గిరి నాథ్రెడ్డి(34) టాప్ స్కోరర్గా నిలవగా..ఇతర బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యారు. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు(5) సైతం నిరాశపరిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ ఆంధ్ర బౌలర్ల ధాటికి 172 పరుగులకే కుప్పకూలింది. మనీష్ 4 వికెట్లతో చెలరేగి గుజరాత్ పతనాన్ని శాసించాడు.
హిమాచల్తో సైతం..
హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 109 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్లతో భరత్ అజేయంగా 161 పరుగులు చేశాడు. తనదైన బ్యాటింగ్తో హిమాచల్ బౌలర్లను చితక్కొట్టాడు. దాంతో ఆ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. కేఎస్ భరత్తో పాటు అశ్విన్ హెబ్బర్(132 బంతుల్లో 10 ఫోర్లతో 100) సెంచరీతో రాణించాడు. చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34) విలువైన పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన హిమాచల్ ప్రదేశ్.. 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిషీ ధావన్(79) మినహా అంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లో గిరినాథ్ రెడ్డి 4 వికెట్లతో రాణించాడు.
చెలరేగుతున్న ఐపీఎల్ స్టార్లు..
ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన భరత్ 2 సెంచరీల సాయంతో 370 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో రుతురాజ్(5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 603 పరుగులు), భరత్తో పాటు మరో ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్(5 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 349 పరుగులు) కూడా రాణిస్తున్నారు. ఈ ఇద్దరు భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ ఆడే మూడు వన్డేల సిరీస్లో చోటు దక్కించుకోనున్నారు.
లాస్ట్ బాల్ సిక్స్తో..
గత ఐపీఎల్ వేలంలో కనీస ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో జాక్పాట్ కొట్టనున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడే అవకాశాన్ని అందుకున్న భరత్.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించాడు. ఆ ఒక్క మ్యాచ్తో హీరోగా మారిపోయాడు. వికెట్కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మెగా వేలంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.