ధోని టెస్టు రికార్డుపై కన్నేసిన కోహ్లీ
కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 46 టెస్టు మ్యాచ్లాడి 26 టెస్టు విజయాలను సొంతం చేసుకున్నాడు. అదే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 60 టెస్టు మ్యాచ్లాడి 27 టెస్టు విజయాలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. విండిస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఈ టెస్టు సిరిస్ను నెగ్గితే కోహ్లీ కూడా అత్యధిక టెస్టు విజయాలను నెగ్గిన కెప్టెన్ల జాబితాలో ధోని రికార్డుని సమం చేస్తాడు. ఇక, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 21 టెస్టు విజయాలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
వెస్టిండిస్పై 2000 పరుగుల మైలురాయి
ఈ పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ వన్డేల్లో వెస్టిండిస్పై 2000 పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. ఇప్పటికే 33 వన్డేలు ఆడిన కోహ్లీ 70.81 యావరేజితో 1912 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ మరో 88 పరుగులు చేస్తే విండిస్ జట్టుపై 2000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా అరుదైన ఘనత సాధిస్తాడు. కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ 39 మ్యాచ్ల్లో 1573 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో మరో 314 పరుగులు చేస్తే
టెస్టుల్లో వెస్టిండిస్తో ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 45.73 యావరేజితో 686 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విండిస్ పర్యటనలో భాగంగా జరగనున్న రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ గనుక మరో 314 పరుగులు చేస్తే వెస్టిండిస్ జట్టుపై టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన 11వ భారత బ్యాట్స్మన్గా అరుదైన ఘనత సాధిస్తాడు.
గేల్ సిక్సుల రికార్డుని రోహిత్ బద్దలు కొట్టేనా?
రోహిత్ శర్మ మరో 5 సిక్సులు బాదితే టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ రికార్డుని అధిగమిస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్(105 సిక్సులు), మార్టిన్ గుప్టిల్(103) సిక్సులతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా... రోహిత్ శర్మ 94 టీ20ల్లో 101 సిక్సులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.