కోహ్లీ, డివిలియర్స్ విధ్వంసం:
ఐపీఎల్-2016లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సృష్టించిన సెంచరీల విధ్వంసంను అభిమానుళ్లు ఎప్పటికీ మరచిపోరు. ఈ మ్యాచ్లో డివిలియర్స్ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కోహ్లీ 109 పరుగులు చేశాడు. పర్యావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ఆ రోజు ఆర్సీబీ గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగింది.
'గ్రీన్ డే' మ్యాచ్ జెర్సీలు వేలం:
అప్పటి మ్యాచ్లో తాము ఆడిన బ్యాట్లు, జెర్సీలతో పాటు ఇతర కిట్లను కూడా వేలానికి ఉంచుతున్నట్లు కోహ్లీ, డివిలియర్స్ ప్రకటించారు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని కరోనా వైరస్ సేవా కార్యక్రమాలకు అందిస్తామని తమ మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో వీళ్లిద్దరు వెల్లడించారు. తమ సంతకాలతో ఉండే ఈ జ్ఞాపికలు అభిమానులు అపురూపంగా దాచుకోవచ్చని కూడా తెలిపారు.
పర్యావరణ పరిక్షణ కోసం గ్రీన్ మ్యాచ్:
'2016 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో మేమిద్దరం శతకాలు బాదాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ రోజు ఆటను బాగా ఆస్వాదించాం. నేను 129 పరుగులు చేశాను. నువ్వు సెంచరీ సాధించావు. పర్యావరణ పరిక్షణ పట్ల చైతన్యం కలిగించడానికి గ్రీన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో మనం ఆడిన కిట్లను వేలం వేద్దాం. దీని ద్వారా వచ్చిన నగదును కరోనా ఫండ్కు ఇద్దాం. అభిమానులూ ఆలస్యం చేయకండి. వేలంలో ఎంత ఎక్కువ డబ్బు వస్తే.. అంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంది' డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఇన్నేళ్లు వారితో ఉంటాననుకోలేదు:
2011 ఐపీఎల్ నుంచి ఒకే జట్టులో సభ్యులుగా ఉన్న కోహ్లీ, డివిలియర్స్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో పలు ఆసక్తికర అంశాలు అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ చాటింగ్ను అనుసరించారు. తొలిసారి ఆర్సీబీ జట్టుతో చేరినప్పుడు ఇన్నేళ్లు వారితో ఉంటాననే నమ్మకం తనకు కనిపించలేదని ఏబీ గుర్తు చేసుకోగా.. తాను ఎప్పటికీ బెంగళూరు జట్టును వీడనని, మరో జట్టుకు ఆడనని కోహ్లీ స్పష్టం చేశాడు.