సర్వత్రా ఆసక్తి:
కరోనా వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ జరగడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. మరికొన్ని దేశాల్లో మాత్రం సాధన చేసేందుకూ అనువైన పరిస్థితులు లేవు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెస్టిండీస్ జట్టుతో బయో సెక్యూర్ వాతారణంలో సిరీస్ ఆడించేందుకు సిద్దమయింది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా బయో సెక్యూర్ వాతావరణంలో సౌతాంప్టన్ వేదికగా జులై 8 నుంచి తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. బంతిపై ఉమ్మి రాయడం నిషేధం, సంబరాలపై ఆంక్షల నేపథ్యంలో సిరీస్పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
బయో సెక్యూర్ అంటే?:
క్రికెటర్లకు ఒకరినుంచి మరొకరికి వైరస్ సోకకుండా లేదా అసలు వైరస్ ఉనికే లేకుండా ఉంచేందుకు బయో సెక్యూర్ వాతావరణం సృష్టిస్తున్నారు. దీంతో మ్యాచులు జరిగే ప్రాంతంలో వైరస్ ఉండదని ఐసీసీ, ఈసీబీ భావిస్తోంది. ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఈసీబీ కట్టుదిట్టంగా ప్రణాళిక రూపొందించింది. మూడు వేదికల్లో జరగాల్సిన సిరీస్ను రెండింటికే పరిమితం చేసింది. స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. అక్కడి ఇతరులు రాకుండా నిబంధనలు జారీ చేశారు. క్రికెటర్లు సైతం బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. పర్యాటక వెస్టిండీస్ జట్టు, మ్యాచ్ అధికారులు, బ్రాడ్కాస్టర్లు, ఇతర సిబ్బంది సైతం ఈసీబీ నిబంధనలు పాటించి మూడు వారాలు క్వారంటైన్లో ఉన్నారు.
జూలై 8న తొలి టెస్టు:
ఆటగాళ్లు మ్యాచుల్లో ఒకరినొకరు ముట్టుకోకూడదు. సంబరాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే జరుగుతున్న సన్నాహక మ్యాచుల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు ఈ పద్ధతులు పాటిస్తున్నారు. వికెట్లు తీసినప్పుడు మోచేతి సంబరాలు చేసుకుంటున్నారు. బంతిపై ఉమ్మితో రుద్దడం లేదు. జేమ్స్ అండర్సన్ వంటి పేసర్లు ఎక్కువగా హ్యాండ్ శానిటైజర్లు వాడారు. ఇలా క్రికెట్ మ్యాచ్ బయో సెక్యూర్ వాతావరణంలో జరగాలన్న మాట. ఈ నియమనిబంధనలతో జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.
సందేహాలు కూడా ఉన్నాయి:
బయో సెక్యూర్ విధానం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇంగ్లండ్ వంటి దేశాల్లో దీనికి అనుకూలంగా ఉన్నా.. వేరే దేశాల్లో మాత్రం ఇది కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం అందరికీ అది సాధ్యపడదని అంటున్నారు. ఆటగాళ్లను హెటళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చేయడం వరకూ ఓకే కానీ, క్రికెట్ స్టేడియాలకు ఆనుకుని హోటళ్లు అన్ని చోట్ల ఉండవు కదా అంటున్నారు. ఇతరులను హోటళ్లకు అనుమతి లేకుండా చేయాలంటే అందుకు అయ్యే ఖర్చులను క్రికెట్ బోర్డులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకండా క్రికెట్ టోర్నీలు నిర్వహించి బోలెడంత నష్టం చూడటానికి సిద్ధమైన బోర్డులు.. అదనపు ఖర్చును భరించడం అంటే తలకు మించిన భారమే అవుతుంది.