కీపర్ రేసులో రాహుల్:
తాజాగా ఇండియా టుడే కార్యక్రమం 'ఇన్స్పైర్'లో రవిశాస్త్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. 'ఇప్పటికే రాహుల్ ఐపీఎల్లో పంజాబ్, దేశవాళీలో కర్ణాటక జట్లకు కీపింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియాకు రాహుల్ కీపింగ్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎవరి సామర్థ్యాలేంటో చూడాలి. ఐపీఎల్లో అద్భుత ఇన్నింగ్స్లు ఆడిన క్రికెటర్లు మిడిలార్డర్లో రాణించొచ్చు. ఒకేసారి విభిన్న పాత్రలు పోషించే, టాప్ ఆర్డర్లో ఉపయోగపడే ఆటగాళ్లకు అండగా నిలవాలి' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
పంత్ ప్రశాంతంగా ఉండాలి:
'పంత్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. బ్యాటింగ్ ఎలా చేయాలన్నదానిపై స్పష్టత ఉండాలి. తొలి బంతి నుంచే సిక్సర్ బాదాలనే ఆలోచనను మానుకోవాలి. ప్రతిసారీ అది పనిచేయదు. హిట్టింగ్ అవసరం అన్న సమయంలో మాత్రమే అలా ఆడాలి. ఆట అన్నీ నేర్పిస్తుంది. అతడు దానిని నేర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి' అని రవిశాస్త్రి అన్నారు.
దేశవాళీ క్రికెట్ ఆడటంలో తప్పులేదు:
'ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు దేశవాళీ క్రికెట్ ఆడటంలో తప్పులేదు. ఆ స్థాయిలో ఒత్తిడి కాస్త తక్కువ ఉంటుంది. పంత్ది చిన్నవయసే కావడం అదృష్టం. 3-6 నెలలు దేశవాళీ క్రికెట్ ఆడి మెరుగవ్వాలి. అప్పుడు జాతీయ జట్టులోకి మరింత దృఢంగా తిరిగిరావొచ్చు. విమర్శలను పట్టించుకోవద్దు. అతడికి కాస్త సమయం ఇవ్వాలి. ఐదేళ్ల తర్వాతా పంత్ రాణించకపోతే అప్పుడు మాట్లాడాలి' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.
ఆడాలనుకుంటే ఎవరూ ఆపలేరు:
'ఎంఎస్ ధోనీ విరామం తీసుకోవడం మంచిదే. ఐపీఎల్ సమయానికి బ్యాటు పట్టుకుంటాడు. టెస్టు క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. వన్డేలపై అంతగా ఆసక్తి లేదనుకుంటా. టీ20లే అతడికి అవకాశం. విశ్రాంతి తర్వాత శరీరం సహకరిస్తుందో లేదో మహీకే తెలుసు. విశ్రాంతి వల్ల శారీరకంగా, మానసికంగా మెరుగవుతారు. మహీ ఐపీఎల్ ఆడతాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే ఆడతాడు. ఎవరూ అడ్డుచెప్పరు' అని శాస్త్రి తెలిపారు.