హైదరాబాద్: విరాట్ కోహ్లీ.. ఉస్సేన్ బోల్డ్ల ట్విట్టర్ ప్రచారానికి తెరపడింది. టీమిండియా సెన్సేషనల్ క్రికెటర్ కేఎల్ రాహుల్తో అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూమా సంస్థకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, తాజా ఉత్పత్తలకు ఆయన ప్రచారకర్తగా ఉంటారు. దీంతో ఇప్పటికే ప్యూమాతో ఒప్పందాలు కుదుర్చుకొన్న విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్ల జాబితాలో రాహుల్ చేరాడు.
ఈ ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. 'ఒక ప్రత్యేక స్పోర్ట్స్ బ్రాండ్తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. ఒక క్రికెటర్గా నేనెప్పుడూ అందరికన్నా ముందుండాలని ప్రయత్నిస్తుంటా. ప్యూమా సైతం ఇలాంటి విలువలనే పాటిస్తుంది. ప్యూమా తరఫున ఇతర క్రీడాతారలు, అథ్లెట్లతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంటుంది' అని రాహుల్ అన్నాడు.
Thank you @usainbolt @imVkohli for the warm welcome to the @PUMA fam. The excitement is overwhelming! Looking forward to being #ForeverFaster @pumacricket pic.twitter.com/Pz1T8wEJA6
— K L Rahul (@klrahul11) August 7, 2018
కేఎల్ రాహుల్ ప్రపంచ స్థాయి ఆటగాడని, అతడి శైలి, స్టైల్ యువతకు బాగా నచ్చుతుందని ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ అన్నారు. మైదానంలో అతడి ప్రదర్శన, శైలి చాలా బాగుంటుందన్నారు. కాగా ప్యూమాతో ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడో అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ విషయంపై ట్విటర్ వేదికగా ఉసేన్ బోల్ట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా సవాళ్లు విసురుకున్నారు. ప్యూమా షూ బ్రాండ్ ప్రచారకర్తలైన కోహ్లీ, బోల్ట్.. తమతో జత కలవబోయే కొత్త అథ్లెట్పై బెట్ వేసుకున్నారు.
ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా కొత్తగా రానున్న భారత క్రికెటర్ ఎవరో ఊహించాలని బోల్ట్కు విరాట్ సవాల్ విసిరాడు. తన ఫేవరెట్ క్రికెట్ స్పైక్స్ను బెట్గా పెట్టాడు. దీనికి వెంటనే బోల్ట్ స్పందించాడు. 'కోహ్లీ.. అతడు ఎవరో నాకు తెలుసు. నా ఫేవరెట్ రన్నింగ్ స్పైక్స్ను కూడా పందెంగా పెడుతున్నా. అతడు వేగంగా పరిగెత్తగలడు.. కానీ నా అంత కాదు. ఎవరు గెలుస్తారో వేచి చూద్దామ'ని బోల్ట్ ప్రతి సవాల్ విసిరాడు. ఇది కూడా ప్రచారంలో ఓ భాగమే కాబోలు.