చెన్నై చేతిలో..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత.. భారీ స్కోరును నమోదు చేసింది. 20 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్ నితీష్ రాణా ఒక్కడే రాణించాడు. చివరి ఓవర్లలో మాజీ కేప్టెన్ దినేష్ కార్తీక్ ధాటిగా ఆడటంతో భారీ స్కోరును అందుకోగలిగింది. ఆ స్కోర్ను కాపాడుకోలేకపోయింది కోల్కత. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి బంతికి విజయాన్ని అందుకుంది. కోల్కత ప్లేఆఫ్ అవకాశాలకు గండి కొట్టింది.
ప్లేఆఫ్ ద్వారాలు క్లోజ్..
ఐపీఎల్-2020 సీజన్లో కోల్కత నైట్ రైడర్స్ ప్రస్థానం గొప్పగా సాగలేదు. పడుతూ లేస్తూనే ఈ దశకు చేరుకుంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్లను ఆడిన ఆ జట్టు.. ఏడింట్లో ఓడిపోయింది. ఇక మిగిలింది ఒక్క మ్యాచే. అందులో గెలిచినా నేరుగా ప్లేఆప్ అవకాశాలకు చేరుకోలేదు. 14 పాయింట్ల వద్దే నిలిచిపోతుంది. ప్లేఆఫ్ కోసం మిగిలిన జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. దీనికోసం నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. కోల్కత.. తన చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. అందులో ఓడితే.. ఇక ఇంటిదారి పడుతుంది.
ఫలించని మిడ్ సీజన్లో మార్పు..
కోల్కత నైట్ రైడర్స్ టీమ్ మేనేజ్మెంట్ చేసిన మిడ్ సీజన్ కేప్టెన్సీ మార్పు ప్రభావం ఆ జట్టు మీద పడినట్టే కనిపిస్తోంది. ప్రారంభ మ్యాచ్లకు కేప్టెన్గా వ్యవహరించిన దినేష్ కార్తీక్ స్వచ్ఛందంగా తప్పుకోవడం.. ఆ స్థానాన్ని ఇవాన్ మోర్గాన్కు అప్పగించడం జరిగిపోయాయి. సీజన్ మధ్యలో కేప్టెన్సీని మార్చడం మంచిది కాదని, అది జట్టు ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందంటూ అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడవి నిజం అవుతున్నాయి.
వరల్డ్ కప్ విన్నింగ్ కేప్టెన్కు పగ్గాలిచ్చినా..
ఇవాన్ మోర్గాన్.. అసాధారణ ఆటగాడే. జట్టును సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ లక్షణాలూ అతనిలో ఉన్నాయి. ఇంగ్లాండ్ జాతీయ జట్టు కేప్టెన్ అతను. అతని కేప్టెన్సీలోనే ఆ జట్టు మొట్టమొదటి సారిగా ప్రపంచకప్ను అందుకుంది. బ్యాటింగ్లోనూ అద్భుతంగా రాణించగలడు. పించ్ హిట్టర్గా పేరుంది. ఒంటిచేత్తో మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. మిడ్ సీజన్లో అతని చేతికి జట్టు పగ్గాలను అప్పగించడం వల్ల తడబడ్డాడనేది స్పష్టమౌతోంది. జట్టును ఏకతాటిపైకి తీసుకుని రాలేకపోయాడు. విజయాల వైపు నడిపించలేక విఫలం అయ్యాడు.
అప్పుడే హెచ్చరించిన గంభీర్..
మిడ్ సీజన్ ప్రయోగాలు జట్టుకు ఏ మాత్రం మంచివి కావంటూ కోల్కత నైట్ రైడర్స్ జట్టు మాజీ కేప్టెన్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ అప్పట్లోనే హెచ్చరించాడు. అది జట్టు ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నాడు. కేప్టెన్, కోచ్తో ఆటగాళ్లకు ఉండే అనుబంధాన్ని దెబ్బకొడుతుందని, అప్పటిదాకా కేప్టెన్గా వ్యవహరించిన దినేష్ కార్తీక్ ఆటతీరుపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. ఇప్పడదే నిజమైంది. ఐపీఎల్-2020లో ఏడు మ్యాచ్లకు దినేష్ కార్తీక్ కేప్టెన్గా వ్యవహరించగా.. నాలుగు విజయాలను అందుకోగలిగింది. మోర్గాన్ కేప్టెన్సీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది కోల్కత.