
హైదరాబాద్: గత పదిరోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలతో కేరళ మొత్తం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు తోడు తీవ్రమైన వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్థమయింది. కేరళ వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 385 మంది దుర్మరణం చెందారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరదలు బీభత్సం సృష్టించాయని, 80 డ్యామ్ల గేట్లు ఎత్తివేశామని, ఇప్పటికే 324 మంది ప్రాణాలు కోల్పోయారని, 3లక్షల మందికి పైగా బాధితులు 1500కు పైగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని, తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ సీఎం పినరయి విజయ్ ట్వీట్ చేశారు.
ఆయన పిలుపుతో పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. కొందరు నేరుగా సాయం చేస్తే... మరి కొందరు కేరళ వాసులకు సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల భారత యువ క్రికెటర్ సంజు శాంసన్ రూ.15లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు అతని తండ్రి విశ్వనాథ్, సీఎం విజయన్ను కలిసి చెక్కు అందజేశారు.
ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ "పబ్లిసిటీ కోసం నేను ఇలా చేయలేదు. నేను సాయం చేసిన విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. కేరళ వాసుల కోసం మీరందరూ కూడా సాయం చేయండి. నేను చేసిన ఈ సాయాన్ని చూసి మరికొందరు కదులుతారన్న ఆశతో ఇలా చేశాను" అని అన్నాడు.
మరోవైపు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, హర్భజన్సింగ్, హార్దిక్ పాండ్యా, టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి తదితరులు కేరళవాసులకు అభిమానులు మద్దతుగా నిలవాలని, తమవంతుగా సాయం చేయాలని పిలుపునిచ్చారు.
సునీల్ ఛెత్రి మాట్లాడుతూ "కేరళకు మన అవసరం ఉంది. వారిని కాపాడుకోవడం మన బాధ్యత. బెంగళూరు ఫుట్బాల్ క్లబ్(బీఎఫ్సీ) తరఫున కేరళ వాసులకు సాయమందిద్దాం. బెంగళూరు ఫుట్బాల్ స్టేడియంలో బీఎఫ్సీ ప్రతినిధులు ఉన్నారు. వారికి మీ సాయాన్ని అందించండి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కేరళకు పంపిద్దాం" అని అన్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో "కేరళలోని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండండి. త్వరలో మీ సమస్యలు తీరతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు ధన్యవాదాలు. దృఢంగా, జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశాడు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ట్విట్టర్లో "కేరళ ప్రజల కోసం ప్రార్థనలు చేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ట్విట్టర్లో "కేరళలోని సోదరసోదరీమణులకు సాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.