కోహ్లీ × ధోనీ
టోర్నీలో భాగంగా ఈ రోజు వీరిద్దరూ నాయకత్వం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా జరుగుతోన్న కొన్ని మ్యాచ్లకు ప్రేక్షకాదరణ కరువైంది.
టిక్కెట్లు హాట్ కేకుల్లా
కోహ్లీ-ధోనీ తలపడే మ్యాచ్కి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం నలభై వేలు. మైదానం వద్ద ఆదివారం సుమారు 25వేల టిక్కెట్ల అమ్మకాలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు రూ.35వేలు, రూ.20వేల విలువ గల టిక్కెట్లు కూడా అందుబాటులో లేవని చెప్పేశారు.
మ్యాచ్ టిక్కెట్లన్నీ అయిపోయి
‘దేశ వ్యాప్తంగా ధోనీ నాయకత్వం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్లు ఆడిన వాటికి చాలా మంచి డిమాండ్ ఉంది. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై ఈ ఏడాది ఐపీఎల్లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు చెన్నైలో ఆడాల్సిన మ్యాచ్లు పుణె తరలి వెళ్లిపోయాయి. ఈ కారణాల వల్లే ఈ రోజు మ్యాచ్ టిక్కెట్లన్నీ అయిపోయి ఉంటాయి' అని స్టేడియం సిబ్బంది తెలిపారు.
చెన్నైపై బెంగళూరుకు మంచి రికార్డేమీ లేదు:
దీంతో టిక్కెట్లు తీసుకుందామని స్టేడియం వద్దకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురౌతోంది. ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి రికార్డేమీ లేదు. ఈ టోర్నీలో చెన్నైదే పైచేయి. మరి సొంత మైదానంలో జరిగే ఈ రోజు మ్యాచ్లో కోహ్లీ సేన గెలుస్తుందో... లేక మళ్లీ పరాజయాన్ని వరిస్తుందో సాయంత్రం మ్యాచ్లో చూడాలి.