
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో ఐపీఎల్ వేలం ముగిసింది. దీంతో జట్టుకు దాదాపు సరిపడ క్రికెటర్లు లభించినట్లే అయింది. మరి వేలంలో అమ్ముడుపోని క్రీడాకారుల పరిస్థితి ఏమైనట్లు..? ఇలాంటి పరిస్థితిల్లోనే పూజారా ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్కు సిద్ధమయ్యాడు.
అతనితో పాటుగా టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా పుజారా బాట పట్టాడు.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఇషాంత్ ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సీజన్లో ససెక్స్ తరఫున ఆడేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. బీసీసీఐ అనుమతి రావడమే ఆలస్యం కౌంటీ బయల్దేరనున్నాడు.
పేసర్లు జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్లు ఐపీఎల్ ఆడేందుకు జట్టును వీడనుండటంతో ససెక్స్.. ఇషాంత్ను ఎంపిక చేసుకుంది. అతడు కౌంటీ క్రికెట్ ఆడనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే పుజారా యార్క్షైర్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. సస్సెక్స్ డైరక్టర్ కీత్ గ్రీన్ ఫీల్డ్ మాట్లాడుతూ.. ఇషాంత్ను జాగ్రత్తగా చూసుకోవడం మాకు చాలా ముఖ్యమైన విషయమని పేర్కొన్నాడు.
అంతర్జాతీయ ఆటగాడైన ఇషాంత్ జట్టుకు సహకారం అందించేందుకు పూనుకోవడం చాలా గొప్ప విషయం అని కొనియాడాడు.
ఏప్రిల్ 4 నుంచి జూన్ 4 వరకు ఇషాంత్ అందుబాటులో ఉంటాడని ససెక్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లతో పాటు 8 వన్డేల్లో అతడు ఆడే అవకాశముంది. ఐపీఎల్ ఆడే అవకాశం లేకపోవడంతో ఇషాంత్ కౌంటీ బాట పట్టాడు. ఐతే ససెక్స్ అతడితో ఒప్పందం చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ యే కావడం గమనార్హం.