ఛాపెల్ కారణం కాదు:
ఇర్ఫాన్ పఠాన్కు బ్యాట్స్మన్గా ప్రమోషన్ రావడానికి అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ కారణమని చాలామంది భావించారు. ఇప్పటికీ అలాగే అనుకుంటారు. అయితే తనను టాప్ ఆర్డర్లో పంపాలన్నది చాపెల్ ఆలోచన కాదని, ఆ ఆలోచన సచిన్ది అని తాజాగా పఠాన్ కుండ బద్దలు కొట్టాడు. అలాగే తన కెరీర్ గాడి తప్పడానికి ఛాపెల్ కారణం కాదన్నాడు. పఠాన్ బ్యాటింగ్పై దృష్టి సారించడంతో బౌలింగ్ను అంతగా పట్టించుకోలేదన్న విమర్శ కూడా ఉంది. అయితే తన కెరీయర్ దెబ్బతినడానికి చాపెల్ కారణమని పఠాన్ ఎప్పుడూ నిందించకపోవడం గమనార్హం.
అది సచిన్ నిర్ణయం:
తాజాగా ఇర్ఫాన్ పఠాన్ 'బియాండ్ ది ఫీల్డ్' అనే కార్యక్రమంలో మాట్లాడుతూ... 'నేను రిటైర్మెంట్ ఇచ్చాక కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చా. నా కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోడానికి ఛాపెల్ కారణమని భావించే వారికి అసలు విషయం చెప్పదల్చుకున్నా. నన్ను వన్డౌన్లో బ్యాటింగ్ చేయమని సచిన్.. అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్కు సూచించాడు. నేను బాగా సిక్సులు కొట్టగలనని, కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోగలనని చెప్పాడు. అలా నన్ను 2005లో శ్రీలంక సిరీస్లో తొలి వన్డేలో టాప్ఆర్డర్లో బ్యాటింగ్కు దింపారు' అని స్పష్టం చేశాడు.
అతడిపై ఆధిపత్యం చెలాయించాలని:
'శ్రీలంక సిరీస్లో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. దాంతో అతడిపై ఆధిపత్యం చెలాయించాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావించింది. అప్పుడే దిల్హారా ఫెర్నాండో 'స్ల్పిట్ ఫింగర్ స్లో బాల్' అనే కొత్త పద్ధతిని అమలు చేశాడు. అది బ్యాట్స్మన్కు సరిగ్గా అర్థం కాలేదు. దాంతో అతడిపైనా నేను దాడి చేస్తే మా ప్రణాళిక విజయవంతమౌతుందని అనుకున్నాం' అని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు:
'నా కెరీర్ మిగిసిపోడానికి ఛాపెల్ కారణం కాదు. అతడు భారతీయుడు కానందున చాలా తేలిగ్గా నిందలు మొపొచ్చు. జట్టులో నన్ను నిజంగా బాధ పెట్టినవారు అలా చేసి ఉండకూడదు. నన్ను ప్రోత్సహించాల్సి ఉండేది. 2008లో శ్రీలంకతో ఆడిన ఓ మ్యాచ్లో భారత్ ఓటమి అంచున ఉన్నా.. నేనే గెలిపించా. ఆ మ్యాచ్లో వికెట్లు కూడా తీశా. ఆ సిరీస్లో సనత్ జయసూర్యను మూడుసార్లు ఔట్ చేశా. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు తీసుకెళ్లినా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆపై జట్టులో నుంచి తొలగించారు. అది అలాగే కొనసాగింది. మధ్యలో నాకు గాయాలైన మాట వాస్తవమే, ఆ పరిస్థితుల నుంచి మెరుగవ్వడానికి జట్టు సహకరించలేదు' అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.