చెన్నై సూపర్ కింగ్స్కు ఈ ఐపీఎల్ 2022 సీజన్ చేదు గుర్తుగా మిగిలిపోతుంది. నాలుగు సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై ఈ దఫా పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో మిగిలిపోయింది. ఈ సీజన్ ప్రారంభంలో ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీని అప్పగించాడు. జడేజా కెప్టెన్సీలో సీఎస్కే 8మ్యాచ్లలో రెండు మాత్రమే గెలవగలిగింది. జడేజా వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతినడంతో అతను మధ్యలోనే కెప్టెన్సీని వదులుకుని తిరిగి ధోనీకి అప్పగించాడు. ధోనీ కెప్టెన్సీ చేపట్టినా పెద్దగా చెన్నై ఫేట్ ఏం మారలేదు.
ఇకపోతే ఐపీఎల్ 15 సంవత్సరాల చరిత్రలో సీఎస్కే ప్లేఆఫ్కు చేరుకోకపోవడం ఇది రెండోసారి మాత్రమే. సీఎస్కే ఈ సీజన్లో పలు మంచి మ్యాచ్లు ఆడినప్పటికీ త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఇక సీఎస్కేకు ఇది నిరుత్సాహకరమైన సీజన్ అయినప్పటికీ కొన్ని సానుకూలాంశాలు కూడా ఆ జట్టుకు ఉన్నాయి. భవిష్యత్తులో చెన్నై జట్టును దుర్భేద్యం చేయలగల ప్లేయర్లు వెలుగుచూశారని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. చెన్నైకు అయిదు పాజిటివ్ అంశాలుగా అయిదుగురు ప్లేయర్లను పేర్కొన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడుతూ.. సీఎస్కేకు ఇది బాధాకరమైన సీజన్ అయినప్పటికీ ఆ జట్టుకు 5 పాజిటివ్లు ఆ జట్టు ప్లేయర్ల రూపంలో లభించాయి. 1) ముఖేష్ చౌదరి 2) డేవన్ కాన్వే 3) మతీషా పతిరానా 4) మహేశ్ తీక్షణ 5) సిమర్జీత్ సింగ్ అని పఠాన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ధోనీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫాస్ట్ బౌలర్లు అయిన ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, మతీషా పతిరానా జట్టులో రెగ్యులర్ ప్లేయర్లుగా రాణించారు.
జూనియర్ లసిత్ మలింగగా పేర్కొనబడే శ్రీలంక యువప్లేయర్ మతీషా పతిరనా తన స్లింగ్లింగ్ యాక్షన్తో బ్యాటర్లను కాస్త ఇబ్బందిపెడుతున్నాడు. అలాగే మరో శ్రీలంకన్ ప్లేయర్ తీక్షణ తొమ్మిది మ్యాచ్లలో 12వికెట్లు పడగొట్టడంతో పాటు 7.45ఎకానమీతో తన బౌలింగ్ కొనసాగించాడు.
2021లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కం బ్యాటర్ డెవాన్ కాన్వే ఐపీఎల్లో భలే సత్తా చాటాడు. ఆకలిగొన్న క్రికెటర్లా రెండు మూడు మ్యాచ్ల్లో తన హిట్టింగ్ పవర్ ఏంటో చూపించాడు. రవీంద్రా జడేజా కెప్టెన్గా ఉన్నప్పుడు డెవాన్ కాన్వేకు సరైన అవకాశాలు రాలేదు. కానీ ధోనీ జట్టు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతను ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆడిన ఏడు మ్యాచ్లలో 145.66 స్ట్రైక్ రేట్తో కాన్వే 252పరుగులు చేశాడు.