అదిరిపోయిన శుభారంభం
158 పరుగుల ఛేదనలో రాజస్థాన్కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్ సిరాజ్ వేయగా.. ఆ ఓవర్లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో మొత్తం 16పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్లో హజిల్ వుడ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి టచ్ లోకి వచ్చిన బట్లర్ తన జోరు చివరి దాకా కొనసాగించాడు. మూడో ఓవర్లో మరోసారి సిరాజ్ బౌలింగ్ వేయగా.. బట్లర్ రెండు ఫోర్లు, సిక్సర్తో టాప్ గేర్లోకి మారాడు. 5వ ఓవర్లో షాబాజ్ అహ్మద్ వేయగా ఆ ఓవర్లోనూ బట్లర్ రెండు సిక్సులు, ఫోర్ తో బెంబేలెత్తించాడు. 5ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్లేమీ కోల్పోకుండా 61పరుగులు చేసింది. అయితే 6వ ఓవర్లో హజిల్ వుడ్ ఈ జోడీని విడదీశాడు. యశస్వి జైశ్వాల్ (21పరుగులు 13బంతుల్లో)ను ఔట్ చేసి ఆర్సీబీకి కాస్త ఊరటనిచ్చాడు.
సంజూ శాంసన్ తో కలిసి బట్లర్ వీరంగం
ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ తో కలిసి బట్లర్ వీరంగం చేశాడు. 7వ ఓవర్లో కేవలం 23బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ తన జోరును ఏమాత్రం తగ్గించలేదు. షాబాజ్ వేసిన 9వ ఓవర్లో సంజూ ఒక సిక్సర్ కొట్టగా.. బట్లర్ రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ను ఆర్సీబీ చేతుల నుంచి దాదాపుగా దూరం చేశారు. 10ఓవర్లు ముగిసేసరికి స్కోరు 103పరుగులకు చేరుకుంది.
దినేష్ కార్తీక్ క్యాచ్ మిస్ చేయడంతో
ఇక 11వ ఓవర్లో ఆర్సీబీకి తీరని నష్టం జరిగింది. హర్షల్ పటేల్ వేసిన ఆ ఓవర్లో బట్లర్ కీపర్ క్యాచ్ గా ఔటవ్వాల్సింది. అతనికి లక్ ఫేవర్ గా ఉంది. లడ్డూలాంటి క్యాచ్ మిస్ చేసిన దినేష్ కార్తీక్.. బట్లర్ కు లైఫ్ ఇచ్చాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక లైఫ్ దొరకడంతో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాదాపు విజయం ఖరారైన దశలో సంజూ శాంసన్ (23పరుగులు 21బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు)ను హసరంగా ఔట్ చేశాడు. అయినా పెద్ద నష్టమేమీ జరగలేదు. పడిక్కల్ తో కలిసి బట్లర్ విజయం దిశగా ఇన్నింగ్స్ నడిపించాడు. 16వ ఓవర్లో హసరంగ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టిన బట్లర్ ఈ సీజన్లో 800పరుగుల మైలురాయి దాటాడు. ఈ క్రమంలో పడిక్కల్ (9పరుగులు 12బంతుల్లో) ఔట్ కాగా హెట్ మయర్ (2పరుగులు)తో కలిసి బట్లర్ లాంఛనాన్ని ముగించాడు. 18వ ఓవర్ చివరి బంతికి రన్ తీసి ఈ సీజన్లో నాలుగో సెంచరీ, ఐపీఎల్లో 5వ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్, తర్వాతి ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో సిక్స్ కొట్టి సగర్వంగా రాజస్థాన్ను ఫైనల్ చేర్చాడు.
అంతకుముందు రాణించిన రజత్ పటీదార్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 157పరుగులు చేసింది. ఆర్సీబీ సెన్షేషనల్ బ్యాటర్ రజత్ పటీదార్ మరోసారి (58పరుగులు 42బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లెవరూ చెప్పకోదగ్గ బ్యాటింగ్ చేయకపోవడంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఇక రాజస్థాన్ బౌలర్లలో ప్రసీద్ క్రిష్ణ 3, ఒబెడ్ మెక్కాయ్ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్ తలా ఓ వికెట్ తీశారు. ఇక రాజస్థాన్ 158పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి మరీ.