
హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా లక్షలాది లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని.. 2018 ఐపీఎల్ను నిషేధించాలని కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం, మ్యాచ్లకు వేదికలు కానున్న తొమ్మిది రాష్ట్రాలకు ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
రెండు వారాల్లోగా దీనిపై సమాధానమివ్వాలని జలవనరుల మంత్రిత్వ శాఖ, బీసీసీఐ, ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్న 9 వేదికల రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ జవాద్ రహీమ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు పిచ్లను తయారు చేసేందుకు లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తారన్నది పిటిషనర్ల వాదన. ''మొత్తం 9 వేదికల్లో 51 రోజుల పాటు ఐపీఎల్-11ను ఆడతారు. పిచ్లను సిద్ధం చేయడానికి లక్షల లీటర్ల నీరు వృథా అవుతుంది. దీని వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడుతుంది'' అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఆల్వార్కు చెందిన హైదర్ అలీ అనే యువకుడు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఐపీఎల్లో పిచ్లను సిద్ధం చేయడానికి లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. నీటిని దుర్వినియోగం చేస్తూ ఈ టోర్నీలో భాగస్వామ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపార ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీని వెంటనే నిలిపేయాలని కోరారు. గత ఐపీఎల్లో మహారాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో కొన్ని మ్యాచ్ల వేదికలను తరలించిన విషయం తెలిసిందే.