ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి భారత కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 19న ఆరంభమయ్యే మెగా టోర్నీ నవంబరు 10న ముగుస్తుంది. ఇంతకుముందు ఐపీఎల్ను కరోనా మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నేతృత్వంలో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది .చైనా మొబైల్ కంపెనీ వివో స్పాన్సర్షిప్ కొనసాగించడం ఐపీఎల్ పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయంలో ముఖ్యమైనది. జూన్ నెలలో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల అనంతరం భారత ప్రభుత్వం చైనా కంపెనీలకు చెందిన పలు యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వివో స్పాన్సర్షిప్ కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఐదేళ్ల వరకు (2022) ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ స్పాన్సర్షిప్ను రద్దు చేసి, కొత్త వారికి ఇచ్చే పరిస్థితి లేనందున వివోను కొనసాగించడానికి పాలక మండలి మొగ్గు చూపినట్లు పాలక మండలి సభ్యుడొకరు తెలిపారు. అయితే ఐపీఎల్ పాలక మండలి నిర్ణయాలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. 'ఐపీఎల్ స్పాన్సర్లు మాతోనే ఉన్నా రు. అందులో ఎలాంటి మా ర్పు లేదు' అని ఓ అధికారి తెలిపారు.
ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించే చాన్స్ ఉందని గతంలో ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించినా.. దీపావళి పండుగ నేపథ్యంలో బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఫైనల్ను మరో రెండు రోజులు వాయిదా వేసి నవంబర్ 10గా నిర్ణయించారు. తద్వారా ఐపీఎల్ ఫైనల్ వారాంతాల్లో కాకుండా తొలిసారి మంగళవారం జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచ్లు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం అరగంట ముందుగా అంటే.. రా.7.30కే మ్యాచ్లు మొదలు పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. టోర్నీ మొత్తంలో కేవలం 10 డబుల్ హెడర్( రోజులో రెండు మ్యాచ్లు) మ్యాచ్లే ఉన్నాయి. ఒకే రోజు రెండు మ్యాచ్లు ఉన్నప్పుడు మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30గంటలకు ఆరంభం అవుతుంది.
యూఏఈలోనే మహిళల ఐపీఎల్.. నవంబరు 1 నుంచి షురూ!!