కర్రాన్, స్టోక్స్ భారీ ధర
ఈ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లపైనే అందరి చూపూ నిలిచింది. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఈ జట్టులో పలువురు ఆటగాళ్లు ఫ్రాంచైజీల దృష్టి ఆకర్షించారు. వారిలో స్టార్ ఆల్రౌండర్ శామ్ కర్రాన్ ఒకడు కాగా.. మరో ఆల్రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. వీళ్లిద్దరూ మినీ వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతారని ముందు నుంచి ఊహించిందే. అనుకున్నట్లే శామ్ కర్రాన్ను ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇంత భారీ ధర మరే ఆటగాడికీ దక్కకపోవడం గమనార్హం. బెన్ స్టోక్స్ను చెన్నై సూపర్ కింగ్స్ కూడా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇంగ్లండ్ ప్లేయర్లు ఎంత సంపాదించారు?
కర్రాన్, స్టోక్స్ మాత్రమే కాదు.. యువ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్ కూడా ఈ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.13.5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు, మాజీ సారధి జో రూట్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. కోటి రూపాయలకు చేజిక్కించుకుంది. ఇలా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వేలంలో బాగా సంపాదించారు. మొత్తమ్మీద ఇంగ్లండ్ ప్లేయర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఏకంగా రూ.56.4 కోట్లు వెచ్చించడం గమనార్హం.
మిగతా దేశాల పరిస్థితి..
ఇంగ్లండ్ తర్వాత భారత ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు 41.45 కోట్లు ఖర్చు పెట్టాయి. పంజాబ్ కింగ్స్ మాజీ సారధి మయాంక్ అగర్వాల్ను అనూహ్యంగా రూ.8.5 కోట్లకు సన్రైజర్స్ కొనుగోలు చేసింది. గతేడాది సన్రైజర్స్ తరఫున విఫలమైన విండీస్ మాజీ సారధి నికోలస్ పూరన్ను లక్నో జట్టు ఏకంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో విండీస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి రూ.23.75 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాతి స్థానంలో రూ.21.25 కోట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అతని కోసం రూ.17.5 కోట్లు ఖర్చు పెట్టింది.