పేరు మార్పుతో బరిలోకి ఢిల్లీ
ఢిల్లీ డేర్డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకుని తొలిసారిగా బరిలోకి దిగిన ఢిల్లీ ఈ సీజన్లో 200 మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ ఫ్లేఆప్స్కు అర్హత సాధించింది. క్వాలిఫయిర్-2 మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
'మన్కడింగ్' రనౌట్ వివాదం
పంజాబ్-రాజస్థాన్ జట్ట మధ్య జరిగిన మ్యాచ్లో ఈ వివాదం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి. ఐపీఎల్లో మన్కడింగ్ ద్వారా ఔటైన తొలి బ్యాట్స్మెన్గా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ నిలవగా... ఔట్ చేసిన బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించారు. ఈ వివాదంలో అశ్విన్పై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
అంఫైర్ తప్పిదాలు
ఐపీఎల్ 12వ సీజన్లో అంఫైర్ తప్పిదాలు చాలా దొర్లాయి. ముంబై ఇండియన్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అంపైర్ల తప్పిదంతో ఆఖరి బంతిని నోబాల్గా ప్రకటించలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఓటమితో బెంగళూరు బ్యాట్స్మెన్ డగౌట్ చేరిన తర్వాత మలింగ వేసినట్లు తేలింది. అయితే అప్పటికే ముంబై విజయం సాధించింది.
12వ సీజన్లో తొలి సెంచరీ
సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ (102 నాటౌట్) సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇదే తొలి సెంచరీ కాగా శాంసన్కు రెండోది.
బ్రావో వేసిన బంతికి బ్యాట్ విరిగింది
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బ్రావో వేసిన బంతికి ఆర్చర్ బ్యాట్ విరిగింది. బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమవ్వగా రాజస్థాన్ కేవలం మూడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కోల్పోయింది. ఇదే ఓవర్లో బ్రావో బౌలింగ్ ధాటికి ఆర్చర్ బ్యాట్ విరిగింది.
ముంబై సెంచరీ
ఐపీఎల్లో వంద విజయాలను నమోదు చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై జట్టు ఐపీఎల్ లీగ్లో 100వ విజయంను నమోదు చేసింది. మొత్తం 175 మ్యాచులలో 100 విజయాలు (56.85 శాతం) సాధించింది. ఈ జాబితాలో ముంబయి తర్వాత 93 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.
అల్జారి అద్భుత ప్రదర్శన
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అల్జారి జోసెఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో అల్జారి జోసెఫ్ (3-0-12-6) ధాటికి హైదరాబాద్ 96 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్ల తీసిన తన్వీర్ రికార్డును ఈ మ్యాచ్లో అల్జారి జోసెఫ్ బద్దలు కొట్టాడు.
మైదానంలోకి ఆవేశంతో ధోని
అభిమానులు కెప్టెన్ కూల్గా పిలుచుకున్న ధోని ఈ సీజన్లో తొలిసారి ఆవేశపడ్డాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే విజయానికి ఆఖరి మూడు బంతుల్లో 8 పరుగులు అవసరంగా కాగా... స్టోక్స్ వేసిన బంతిని అంపైర్లు నోబాల్గా ప్రకటించి నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు. దీంతో డగౌట్లో ఉన్న ధోని మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.
సన్రైజర్స్ తరుపున వార్నర్ 3000 పరుగులు
సన్రైజర్స్ తరుపున డేవిడ్ వార్నర్ మూడు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో డేవిడ్ వార్నర్(12 మ్యాచ్ల్లో 692) పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ కింద వార్నర్కు రూ.10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.
రోహిత్ 3000, అమిత్ మిశ్రా 150
ఈ సీజన్లో రోహిత్ శర్మ టీ20ల్లో 8వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. టీ20ల్లో 8వేల పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇంతకుముందు సురేశ్రైనా, కోహ్లీ ఈ ఘనత సాధించారు. మొత్తంగా 12వేల పరుగులతో క్రిస్ గేల్ అందరికంటే ముందున్నాడు. రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో 2,331 పరుగులు చేశాడు అందులో 4 సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఈ మ్యాచ్లో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా మిశ్రా రికార్డు సృష్టించాడు. మిశ్రా కంటే ముందు ముంబయి ఇండియన్స్ బౌలర్ మలింగ ఈ ఘనత సాధించాడు. అయితే, మిశ్రా తీసిన 150వ వికెట్ రోహిత్దే కావడం విశేషం.
ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన ధోని
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో 4,000 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ధోనీ 184 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి.. 42.03 సగటుతో 4,330 పరుగులు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్లో 200 సిక్సర్లను బాదిన భారత ఆటగాడు ఒక్క ధోని మాత్రమే.
రేయాన్ పరాగ్ హిట్ వికెట్
కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ రేయాన్ పరాగ్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో హిట్వికెట్గా పెవిలియన్కు చేరిన ఏకైక బ్యాట్స్మెన్ రేయాన్ పరాగే.
వాట్సన్ ఖాతాలో ఓ చెత్త రికార్డు
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో షేన్ వాట్సన్ ఈ సీజన్లో అరుదైన రికార్డు సాధించాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే షేన్ వాట్సన్ పెవిలియన్కు చేరాడు. ఈ సీజన్లో అత్యధిక బంతులు ఆడి డకౌటైన ఆటగాళ్లలో వాట్సనే అగ్రస్థానంలో ఉన్నాడు.
|
నాలుగోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై
చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్దే అయింది. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ముంబై చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది.