మెగా ఆక్షన్..
ఈ టోర్నమెంట్లో ఆడబోయే క్రికెటర్ల కోసం మెగా వేలంపాట ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఆదివారం కూడా కొనసాగుతుంది. బెంగళూరు- ఈ మెగా ఆక్షన్కు ఆతిథ్యాన్ని ఇచ్చింది. హోటల్ ఐటీసీ గార్డెనియాలో ఈ వేలం పాటను నిర్వహించనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా ఐపీఎల్ టోర్నమెంట్లో జాయిన్ అయ్యాయి. ఈ రెండు జట్లు ముగ్గురు ప్లేయర్ల చొప్పున రిటైన్ చేసుకున్నాయి. కొత్త వారి కోసం వేలంపాటలో పాల్గొనబోతోన్నాయి.
ముంబైలోనే ఈ నలుగురూ..
చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ప్లేయర్లు పోను.. కొత్త వారిని తీసుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ- కేప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ కీరన్ పొల్లార్డ్ను అట్టి పెట్టుకుంది.
సీఎస్కే రిటైనింగ్..
చెన్నై సూపర్ కింగ్స్.. ఊహించినట్టే కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రిటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ అదే జట్టులో కొనసాగుతున్నారు. కోల్కత నైట్ రైడర్స్లో ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ రిటైన్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్లో సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ కొనసాగుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్లో కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ రిటైన్ అయ్యారు.
ఢిల్లీలోనే రిషభ్..
విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ విడుదల చేయలేదు. రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, ఎన్రిచ్ నోర్ట్జె ఢిల్లీ కేపిటల్స్లోనే కొనసాగుతున్నారు. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్ను రిటైన్ చేసుకుంది. కొత్తగా జాయిన్ అయిన లక్నో సూపర్జెయింట్స్.. కేఎల్ రాహుల్ను 17 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అతనితో పాటు మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ను జట్టులోకి తీసుకుంది. లక్నో టీమ్కు కేఎల్ రాహుల్ కేప్టెన్గా వ్యవహరిస్తాడు.
గుజరాత్ టైటన్స్కు లీడ్..
గుజరాత్ టైటన్స్ హార్ధిక్ పాండ్యాను 15 కోట్ల రూపాయలకు తీసుకుంది. కేప్టెన్గా అపాయింట్ చేసింది. పాండ్యాతో సమానంగా స్పిన్నర్ రషీద్ ఖాన్కు 15 కోట్ల రూపాయలను చెల్లించి- జట్టులోకి తీసుకుంది. కోల్కత నైట్ రైడర్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ను తీసుకుంది. దీనికోసం అతనికి ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించింది. మిగిలిన క్రికెటర్లను తీసుకోవడానికి ఆయా ఫ్రాంఛైజీలన్నీ బెంగళూరులో జరిగే మెగా ఆక్షన్లో పాల్గొనబోతోన్నాయి.
సీఎస్కే, ఢిల్లీ కేపిటల్స్..
రిటైన్ చేసుకున్న ప్లేయర్లకు చెల్లించాల్సిన మొత్తం పోగా- అన్ని జట్ల వద్ద బ్యాలెన్స్ ఉన్న మొత్తం 561.50 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ మొత్తంతో ఆయా ఫ్రాంఛైజీలన్నీ 21 నుంచి 23 మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 48 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఈ మొత్తంతో 21 మంది కొత్త వారిని తీసుకోనుంది. ఇందులో ఏడుమంది విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఢిల్లీ కేపిటల్స్ వద్ద 47.50 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది.
ఏ జట్టు వద్ద ఎంత మొత్తం..
కోల్కత నైట్ రైడర్స్-48, లక్నో సూపర్ జెయింట్స్-59, ముంబై ఇండియన్స్-48, పంజాబ్ కింగ్స్-72, రాజస్థాన్ రాయల్స్-62, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-57, సన్రైజర్స్ హైదరాబాద్-68, గుజరాత్ టైటన్స్-52 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ రెండు రోజుల్లో తమ ఐపీఎల్ జట్లను సమకూర్చుకోవడానికి ఖర్చు చేయనున్నాయి. శని, ఆదివారాల్లో 561.50 కోట్ల రూపాయల లావాదేవీలు చోటు చేసుకోనున్నాయి.