రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఇక అందరూ ఊహించినట్టుగానే యువ ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. భారత అండర్-19 స్టార్స్ యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, ప్రియం గార్గ్, విరాట్ సింగ్ కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. వారి కనీస ధర కంటే పది రెట్లు ఎక్కువకు దక్కించుకోవడంతో.. జూనియర్ ఆటగాళ్లు అందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఇందులో ఒకప్పుడు పూట గడవడం కోసం పానీపూరీ అమ్మిన జైస్వాల్ కూడా ఉన్నాడు.
జాతీయ జట్టులో చోటే లక్ష్యం
ఐపీఎల్ వేలంలో యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఒకప్పుడు ముంబైలో పానీపూరీ అమ్మిన 17 ఏళ్ల జైశ్వాల్ ఒక్కరాత్రిలో కోటీశ్వరుడయ్యాడు. అయితే భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటే లక్ష్యంగా సత్తాచాటుతున్న జైస్వాల్ ఆకలితో పడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చివరకు ఫలితం దక్కించుకున్నాడు.
టెంట్లోనే మూడేళ్లు
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ముంబై నగరానికి చేరుకున్నాడు. ఉండటానికి కనీస వసతి లేకపోవడంతో ఆజాద్ మైదానంలో ఓ టెంట్లోనే మూడేళ్లు గడిపాడు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో బతకడానికి అనేక పనులు చేశాడు. ఇక పానీపూరీ, పండ్లు అమ్మి అవసరాలు తీర్చుకునేవాడు.
పానీపూరీ అమ్ముతూ ప్రాక్టీస్
ఒకవైపు పానీపూరీ, పండ్లు అమ్ముతూ మరోవైపు ఆజాద్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. యశస్విలోని ప్రతిభను, పరిస్థితులను గమనించి కోచ్ జ్వాలా సింగ్ ఆదుకోవడంతో జైస్వాల్ క్రికెట్పై మరింత దృష్టి కేంద్రీకరించాడు. 2015లో పాఠశాల స్థాయిలో జరిగిన గైల్స్ షీల్డ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల (391)తో పాటు అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు (13/99 ) కూడా నమోదు చేశాడు. ఇక స్థానిక లీగ్లలో పరుగుల వరద పారించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ
గత ఆగస్టులో ఇంగ్లండ్లో అండర్-19 ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్ అందించాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున డబుల్ సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ద్విశతకం సాధించిన యువ బ్యాట్స్మన్గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో మొత్తం 564 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో మనోడిని రాజస్థాన్ రూ.2.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.