ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022 ఎడిషన్లో చాలా మంది టీం ఇండియా ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. జోస్ బట్లర్, వనిందు హసరంగా వంటి విదేశీ స్టార్లు కూడా నిలకడతో కూడిన ప్రదర్శనలతో రాణిస్తున్నారు. బట్లర్ ప్రస్తుతం లీగ్లో అత్యధిక పరుగులు (12ఇన్నింగ్స్లలో 625పరుగులు) చేసిన ఆటగాడిగా ఉండగా.. శ్రీలంక ఆటగాడు హసరంగా ఈ సీజన్లో ఇప్పటివరకు యుజ్వేంద్ర చాహల్ (23)తో కలిసి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. గతేడాది కాలంగా.. హసరంగా టాప్ టీ20 స్పిన్నర్లలో ఒకరిగా మారాడు. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ప్లేయర్ తబ్రైజ్ షమ్సీతో హసరంగా తొలి స్థానం కోసం పోటీ పడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో దక్షిణాఫ్రికాకు చెందిన షమ్సీని ఎవరూ కొనుగోలు చేయలేదు.
ఇక ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన తబ్రైజ్ షమ్సీ ఐపీఎల్లో 2016-18మధ్యకాలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆండ్రూ టై స్థానంలో అతన్ని తీసుకుంది. అయితే రాయల్స్ తరఫున షమ్సీ ఒకే ఒక్క గేమ్ ఆడాడు. ఐపీఎల్ టోర్నీలో తనకు సరిగా అవకాశాలు రాకపోవడాన్ని షమ్సీ ప్రస్తావించాడు. ఒకవేళ తనకు రెగ్యులర్ అవకాశాలు ఇస్తే జట్టు ట్రోఫీ గెలిచేలా చేస్తా అని అతను పేర్కొన్నాడు.
'నన్ను కొనాలా వద్దా అనే విషయం నా చేతుల్లో లేదు. అందువల్ల ఐపీఎల్లో ఏ జట్టు నన్ను తీసుకోలేదని నిరాశపడను. నేను ఐపీఎల్లో ఆడడానికి ఇష్టపడతాను. నేను నా ట్యాలెంట్ను, సత్తాను నమ్ముతాను, ఐపీఎల్లో క్రమం తప్పకుండా ఆడే అవకాశం నాకు లభిస్తే నన్ను ఆడించిన జట్టుకు ట్రోఫీ గెలిపించి ఇస్తానని నేను నమ్ముతున్నాను. నా గత రెండు ఐపీఎల్ స్టింట్లలో నాకు రెగ్యులర్గా ఆడే అవకాశం రాలేదు. ఒక ఆటగాడిగా మన సామర్థ్యాలను ప్రదర్శించడానికి మనకు మంచి అవకాశాలు దక్కాలి. ఇది నా కెరీర్లో స్పష్టంగా తెలిసింది. ఇమ్రాన్ తాహిర్ మా దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నప్పుడు.. నేను రెగ్యులర్గా ఆడలేకపోయాను. కానీ అతను రిటైర్ అయినప్పటి నుంచి నాకు అవకాశొచ్చాయి. నేను నిరూపించుకున్నాను. నేను గేమ్లను గెలిపించగలననే నమ్మకమొచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకోగలనని చూపించగలిగాను. అని షమ్సీ పేర్కొన్నాడు.