హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ తమకు కావాల్సిన ఆటగాళ్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాయి. దీంతో లీగ్కు జట్లన్నీ సిద్ధమైపోయాయి. ఈ క్రమంలో ఐపీఎల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇక 10 జట్లు కూడా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఐపీఎల్లో తాము అనుసరించబోయే వ్యూహాల గురించి వెల్లడించాడు. ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ను కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. వీరిద్దరు ఈ సారి తమ జట్టు ఓపెనర్లుగా ఉంటారని తెలిపారు. అలాగే ఈ సీజన్లో కూడా సన్రైజర్స్ కెప్టెన్గా కేన్ విలియమ్సనే వ్యవహరించనున్నట్లు మురళీధరన్ స్పష్టం చేశారు.
గతంలో మిడిలార్డర్లో ఆడిన అభిషేక్ శర్మకు ఓపెనర్గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మురళీధరన్ తెలిపారు. రాబోయే మూడేళ్లను దృష్టిలో పెట్టుకునే మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే ఈ సారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు. కాగా మెగా వేలంలో ఈ యువ ఆల్రౌండర్ను సన్రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో పోటీ పడి 6 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 17 సగటుతో 242 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో మొదట అభిషేక్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మొత్తం 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అంతకుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే జట్టులోని సభ్యుల సంఖ్య 23కు చేరుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ప్రియమ్ గార్గ్, జె సుచిత్, శ్రేయాస్ గోపాల్, అభిషేక్ శర్మ, రొమారియో షెఫర్డ్, సీన్ అబ్బాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హక్ ఫరూకీ