165 పరుగులకు కట్టడి చేసినా..
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత నైట్రైడర్స్ 165 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంకటేష్ అయ్యార్-43, అజింక్యా రహానే-25, నితీష్ రాణా-43 రాణించారు. ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విజంభణతో స్కోర్ మందగించింది. మిడిల ఆర్డర్లో రింకూ సింగ్-23 మినహా మరెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. ఆరుమంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ నమోదు చేశారు. ఈ సీజన్లో తొలిసారిగా బుమ్రా ప్రత్యర్థులను భయపెట్టాడు. నాలుగు ఓవర్లల్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు.
113కే టపటపా
లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆటతీరు అంతకంటే అధ్వాన్నం. 113 పరుగులకే కుప్పకూలిపోయింది. టాప్ టు బాటమ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్.. ఒక్క ఓపెనర్ ఇషాన్ కిషన్ మినహా. అతనొక్కడే కాస్త గట్టిగా పోరాడాడు. 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్తో 51 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు- కనీసం అతనికి అండగా కూడా నిలవలేకపోయారు. రోహిత్ శర్మ-2, హైదరాబాదీ తిలక్ వర్మ-6, రమణ్దీప్ సింగ్-12, టిమ్ డేవిడ్ -13, కీరన్ పొల్లార్డ్-15, డేనియల్ సామ్స్-1, మురుగన్ అశ్విన్-0, కుమార్ కార్తికేయ-3, జస్ప్రీత్ బుమ్రా-0 పరుగులు చేశారు.
పేస్కు దాసోహం..
ముంబై ఇండియన్స్ బ్యాటర్లు కూడా పేస్ బౌలింగ్కు దాసోహం అయ్యారు. పాట్ కమ్మిన్స్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌథీ.. నిప్పుల్లాంటి బంతులను సంధించారు. పాట్ కమ్మిన్స్ తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రస్సెల్స్-2, టిమ్ సౌథీ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ కూల్చారు. ఏకంగా 52 పరుగుల తేడాతో ఓడిపోవడం- ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో చెత్త రికార్డ్ను జమ చేసింది.
తొలి ఓవర్లోనే రోహిత్ మళ్లీ
ఈ సీజన్లో వరుస ఓటములు ఎదురైనా ముంబై- ఎలాంటి గుణపాఠాలను నేర్చుకోలేదనేది ఈ మ్యాచ్తో మరోసారి తేలిపోయింది. తొలి ఓవర్లోనే అవుట్ కావడాన్ని రోహిత్ శర్మకు బాగా అలవాటైనట్టుంది. ఈ మ్యాచ్లోనూ అదే తరహాలో వెనుదిరిగాడు. తొలి ఓవర్ చివరి బంతికి టిమ్ సౌథీకి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోరు రెండు పరుగులే. 32 పరుగుల వద్ద రెండో వికెట్ పడ్డ తరువాత ఇక ఎక్కడా బ్రేక్ లేదు. సైకిల్ స్టాండ్లా మారింది ముంబై బ్యాటింగ్ తీరు.
13 పరుగుల తేడాలో అయిదు వికెట్లు..
ప్రత్యేకించి- జట్టు స్కోర్ 100కు చేరుకున్న అనంతరం ముంబై బ్యాటర్లు అవుట్ అయిన తీరు వారి నిలకడలేమికి అద్దం పట్టింది. 13 పరుగుల తేడాతో చివరి అయిదు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 100 పరుగులు ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి 113 పరుగులు చేరేటప్పటికీ బ్యాటర్లందరూ పెవిలియన్లో కూర్చున్నారు. చివరి అయిదు ఓవర్లల్లో కోల్కత బౌలర్ల పనితీరు అద్భుతః. పోటీ పడి మరీ వికెట్లు తీసుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్ మిస్సింగ్..
మిడిలార్డర్లో బ్యాటింగ్ భారాన్ని మోసే సూర్యకుమార్ యాదవ్.. జట్టుకు అందుబాటులో లేకపోవడం దెబ్బతీసింది. అతనికి జోడీ హైదరాబాదీ తిలక్ వర్మ ఇదివరకు జరిగిన మ్యాచ్లల్లో విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ భాగస్వామ్యం ఇక్కడ మిస్ అయింది. ఒకవంక చాలాకాలం తరువాత ఇషాన్ కిషన్ క్రీజ్లో నిలదొక్కుకుని ఉంటే అతనికి సహకారాన్ని అందించే బ్యాటర్లు కరవయ్యారు. బ్యాటింగ్ భారం మొత్తం అతనే మోశాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
పొల్లార్డ్ రనౌట్..
కీలక సమయంలో కీరన్ పొల్లార్డ్ రనౌట్ కొంత ప్రభావాన్ని చూపింది. 18వ ఓవర్ రెండో బంతికి పొల్లార్డ్ రనౌట్గా వెనుదిరిగాడు. వరుసగా రెండు మ్యాచ్లల్లో విజయం సాధించిన అనంతరం మళ్లీ ఓడింది ముంబై. 11 మ్యాచ్ల్లో ఆ జట్టు గెలిచింది ఈ రెండే. ఇంకో మూడు మ్యాచ్లు మిగిలివున్నాయి. తన తదుపరి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్తో తలపడుతుంది.