అన్సోల్డ్గా ఆసీస్ స్టార్స్..
కొందరు ఆటగాళ్ల ధర అమాంతం పెరిగి కోటీశ్వరులు అయితే మరికొందరికి మాత్రం నిరాశనే మిగిలింది. 217 స్థానాలకు క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉన్నా... 204 మందితోనే 10 ఫ్రాంచైజీలు సరిపెట్టాయి. ఐపీఎల్ సూపర్ స్టార్ సురేశ్ రైనాతో పాటు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ తదితర పేరున్న పలువురు ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఏ జట్టు కూడా వీరిని కొనేందుకు ఆసక్తికనబరచలేదు.
అలా వెళ్లిపోయినందుకే..
అయితే ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ గత సీజన్లో ఆర్సీబీకి ఆడారు. రూ.4 కోట్ల భారీ ధరకు కేన్ రిచర్డ్సన్ను ఆర్సీబీ అప్పట్లో కొనుగోలు చేసింది. అయితే ఈ సారి ఈ ఇద్దరూ అన్ సోల్డ్ లిస్ట్లో చేరారు. దీనిపై తాజాగా రిచర్డన్సన్ స్పందించాడు. ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘నిజంగా ఆడమ్ జంపాను ఎవరూ కొనలేదంటే నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. నిజాయితీగా మాట్లాడుకుంటే... మేము గత సీజన్ మధ్యలోనే లీగ్ నుంచి వైదొలిగాం. ఈ తప్పిదానికి మనం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అప్పడే జంపాతో అన్నాను.
అప్పుడు వెళ్లిపోవడమే..
అయితే, ఆ సమయంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడమే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. అందుకే వెళ్లిపోయాం. వేలం సమయంలో ఫ్రాంఛైజీలు మాపై ఆసక్తి చూపకపోవడానికి, మమ్మల్ని కొనుగోలు చేయకపోవడానికి ఇదొక కారణమని నేను భావిస్తున్నా.'అని రిచర్డ్సన్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయానని పేర్కొన్నాడు.
ప్రపంచకప్లో మెరిసినా..
మెగా వేలం నేపథ్యంలోనూ తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్ -2021 కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెకు కొందరు ఆటగాళ్లు దూరమయ్యారు. అందరికన్నా ముందే ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ స్వదేశానికి పయనమయ్యారు. ఇక ఆడమ్ జంపా టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయినా ఈ స్పిన్ బౌలర్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు.