సామ్స్పై బూతుల దాడి..
ముంబై ఇండియన్స్ బౌలర్ డేనియల్ సామ్స్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అతనిపై నిప్పులు కురిపిస్తోన్నారు అభిమానులు. ఘాటు వ్యాఖ్యలతో బౌన్సర్లు సంధిస్తోన్నారు. కుటుంబాన్ని కూడా వదలట్లేదు. సామ్స్ వ్యక్తిగత జీవితాన్నీ టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై బూతుల వర్షాన్ని కురిపిస్తోన్నారు. సామ్స్ అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
హ్యాట్రిక్ పరాజయాలు..
దీనికి ప్రధాన కారణం- కోల్కత నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడమే. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై ఇన్నిరోజులైనప్పటికీ ఇప్పటివరకు రోహిత్ శర్మ సేన గెలుపు రుచి చూడలేదు. హ్యాట్రిక్ పరాజయాలను అందుకుంది. ఆడిన మూడు మ్యాచ్లల్లోనూ ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది. చెన్నై సూపర్ కింగ్స్తో సమానంగా నిలిచింది ఈ ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్.
కుమ్మేసిన కమ్మిన్స్..
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్కత నైట్ రైడర్స్ చేతిలో చిత్తయింది. రోహిత్ సేన నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది..ఇంకా నాలుగు ఓవర్లు మిగిలివుండగానే. 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన ఉండగా పాట్ కమ్మిన్స్ దీన్ని ఆరే ఆరు బంతుల్లో లాగించేశాడు. 16వ ఓవర్లో విజయాన్ని సాధించడానికి అవసరమైన 35 పరుగులను పిండుకున్నాడు. ఆ ఓవర్ను వేసింది డేనియల్ సామ్స్.
ఒక్క ఓవర్లో 35 పరుగులు..
ఇప్పుడతనిపై అభిమానులు బూతులతో విరుచుకుపడటానికి కారణం కూడా ఆ ఓవరే. 6,4,6,6,3 (నోబాల్),4,6..ఇలా ఆ ఒక్క ఓవర్లోనే 35 పరుగులను సమర్పించుకున్నాడీ ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఈ ఓవర్ను ఆడింది పాట్ కమ్మిన్స్. ఆ మ్యాచ్లో అతను 15 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలివుండగానే మ్యాచ్ను ముగించేశాడు. ముంబై ఇండియన్స్ చేతి దాకా వచ్చిన మ్యాచ్ను పాట్ కమ్మిన్స్ లాగేసుకున్నాడు.
ముంబై ఫ్యాన్స్ ఫైర్..
పాట్ కమ్మిన్స్ విజృంభణను రోహిత్ శర్మ గానీ, ఇతర ఫీల్డర్లు గానీ చూస్తూ ఉండిపోయారు. అంతకుమించి చేయడానికి మరేమీ మిగల్లేదు వారి వద్ద. ఈ పరాజయం- ముంబై ఇండియన్స్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని సామ్స్పై కురిపించేశారు. బూతుల దాడి సాగించారు. వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే- ప్లీజ్ స్టాప్ దిస్ అంటూ సామ్స్ అభిమానులను వేడుకోవాల్సి వచ్చింది.
ప్లీజ్ స్టాప్ దిస్..
గెలుపోటములు గేమ్లో సర్వ సాధారణమైనవేనని, కోల్కత నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో తన ప్రదర్శన అత్యంత నాసిరకంగా ఉందని అంగీకరిస్తున్నానని చెప్పాడు. తాను గొప్పగా ఆడలేకపోయానని వ్యాఖ్యానించాడు. జట్టు ఓటమికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అభిమానులు విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నాడు. తనను తిడుతూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లకు మెసేజీలను పంపించడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు.