
ముంబై: చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ టీమ్పై ఆ టీమ్ సహా యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అభిమానులకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆ తర్వాత కూడా కోల్కతా ఆటలో పెద్దగా మార్పేమీ లేదు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లోనూ కేకేఆర్ ఓడిపోయింది. ఆదిలోనే టాపార్డర్ కుప్పకూలడంతో.. హిట్టర్లు మెరిసినా లాభం లేకుండా పోయింది. కేకేఆర్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా షారుక్ స్పందించాడు.
పోరాడి ఓడిన కోల్కతాపై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమిన్స్లు ఆడిన తీరును కొనియాడాడు. కుడా.. వుడా.. షుడా అంటూ గెలిచి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ ఆటగాళ్లను కొనియాడుతూ షారుక్ ఓ ట్వీట్ చేశాడు. 'కేకేఆర్ బాయ్స్ మీరు సూపర్. మనం ఆడిన ఒక్క పవర్ ప్లేను మినహాయిస్తే.. మిగతా అంతా అద్వితీయం. వెల్డన్ బాయ్స్. రసెల్, కార్తీక్, కమిన్స్ల ప్రయత్నం బాగుంది. దీన్నే అలవాటు చేసుకోవాలి. మనం తిరిగి పుంజుకుంటాం' అని షారుక్ ట్వీట్ చేశాడు.
వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై, కోల్కతా మధ్య జరిగిన పోరు రసవత్తరంగా సాగింది. చివరకు ధోనీసేన 18 పరుగుల తేడాతో కోల్కతాను మట్టికరిపించింది. ఫాఫ్ డుప్లెసిస్ (95; 60 బంతుల్లో 9×4, 4×6), రుతురాజ్ గైక్వాడ్ (64; 42 బంతుల్లో 6×4, 4×6) చెలరేగడంతో మొదట చెన్నై మూడు వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. దీపక్ చహర్ (4/29) అద్భుతమైన బౌలింగ్ చేయడంతో 5.2 ఓవర్లకే కోల్కతా 31 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై రసెల్ (54; 22 బంతుల్లో 3×4, 6×6), కార్తీక్ (40: 24 బంతుల్లో), కమిన్స్ (66; 34 బంతుల్లో 4×4,6×6) విధ్వంసం సృష్టించినా కోల్కతాకు ఓటమి తప్పలేదు. 19.1 ఓవర్ల వద్ద 202 పరుగులకు ఆలౌటైంది.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్ దశలోనే ఆగిపోయిన కేకేఆర్.. గౌతమ్ గంభీర్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 విజేతగా నిలిచింది. ఆ తర్వాత ప్లేఆఫ్ వరకూ వెళ్తూ వచ్చింది. ఇక గౌతమ్ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లాడు. గత రెండు సీజన్లుగా కేకేఆర్ ప్రదర్శన మరీ పేలవం. నిరుడు దినేశ్ కార్తీక్ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు. కేకేఆర్ చివరకు అయిదో స్థానంతో లీగ్ను ముగించింది. ఐపీఎల్ 2021లో కూడా 4 మ్యాచులు ఆడి ఒకటే గెలిచింది.