చెన్నై: చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్తో మంగళవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసినా.. బ్యాట్స్మన్ వైఫల్యం కారణంగా చేజేతులారా మ్యాచ్ కోల్పోయింది. విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు కూడా చేయలేక మూల్యం చెల్లించుకుంది. సునాయాసంగా గెలిచే మ్యాచును కోల్కతా చేజేతులా ఓడటంపై ఆ టీమ్ సహా యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ట్వీట్ చేసిన 'కింగ్ ఖాన్' షారుక్ ఖాన్.. నేరుగానే తన అసంతృప్తిని వెల్లగక్కాడు. కోల్కతా నైట్రైడర్స్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. 'తీవ్ర నిరాశ కలిగించే ప్రదర్శన ఇది. అభిమానులు అందరికీ క్షమాపణలు' అని షారుక్ ట్వీట్ చేశాడు. ప్రస్తతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. గత ఆదివారం కోల్కతా తమ 100వ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. '100వ ఐపీఎల్ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. అందరు ప్లేయర్స్ బాగా ఆడారు' అని బాలీవుడ్ బాద్ షా అప్పుడు ట్వీట్ చేశాడు.
Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021
లక్ష్య ఛేదనలో కోల్కతా ఇన్నింగ్స్ సాఫీగా ఆరంభమైంది. ఓపెనర్లు నితీష్ రాణా (57; 47 బంతుల్లో 6×4, 2×6), శుభ్మన్ గిల్ (33; 24 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో 8.4 ఓవర్లలో 72/0తో నిలిచింది. దీంతో ఆ జట్టు తేలిగ్గానే లక్ష్యాన్ని అందుకునేలా కనిపించింది. కానీ స్పిన్నర్ రాహుల్ చహర్ తన మాయాజాలంతో ముంబైని మ్యాచ్లోకి తెచ్చాడు. అతడు తన వరుస ఓవర్లలో గిల్, రాహుల్ త్రిపాఠి (5), ఇయాన్ మోర్గాన్ (7) లను ఔట్ చేయడంతో కోల్కతా 13 ఓవర్లలో 104/3తో నిలిచింది. అయినా రాణా చక్కగా ఆడుతుండడం, అతడికి తోడుగా షకిబ్ ఉల్ హాసన్ క్రీజులో ఉండడంతో కోల్కతాకు ముప్పేమీ లేదనిపించింది. 15వ ఓవర్లో 122/3తో ఆ జట్టు మెరుగ్గా కనిపించింది.
122 స్కోరు వద్ద రాణాను చహర్, షకిబ్ (9)ను కృనాల్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కృనాల్, బుమ్రా.. కార్తీక్ (11 బంతుల్లో 8 నాటౌట్), రసెల్ (9; 15 బంతుల్లో 1×4)లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. భారీ షాట్లు కొట్టనివ్వలేదు. 16వ, 18వ ఓవర్లలో కృనాల్ కేవలం నాలుగు పరుగులే ఇవ్వగా.. 17వ, 19వ ఓవర్లో బుమ్రా 12 పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో కోల్కతా విజయానికి15 పరుగులు అవసరం అయ్యాయి. ఆఖరి ఓవర్లో బౌల్ట్ కోల్కతాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి మూడు ఓవర్లలో కోల్కతాకు ఒక్క బౌండరీ కూడా రాలేదంటే ముంబై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
KKR vs MI: ముంబైతో మ్యాచ్.. కోల్కతా ఓటమికి కారణాలు ఇవే!!