చెన్నై: ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యథిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 32 పరుగులు చేశాడు. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ మొత్తం సిక్సర్ల సంఖ్య 217కు చేరింది.
ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా ఎంఎస్ ధోనీ (216) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ శర్మ శనివారం బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ సిక్స్ల సంఖ్య 217. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు బాదింది మాత్రం విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్. గేల్ 351 సిక్సులు బాదాడు. గేల్ తర్వాత మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (237) ఉన్నాడు. ధోనీ, రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ (201), సురేష్ రైనా (198) ఉన్నారు. ఇక కెప్టెన్గా టీ20ల్లో 4 వేల పరుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్తో రోహిత్ అందుకున్నాడు.
శనివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 13 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 150/5 స్కోరు చేసింది. డికాక్ (40), పొలార్డ్ (22 బంతుల్లో 35), రోహిత్ శర్మ (32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో విజయ్ శంకర్, ముజీబ్ ఉర్ రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్రైజర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. బెయిర్స్టో (43), వార్నర్ (36) తప్ప మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో చహర్, బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. పొలార్డ్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
తాజా విజయంతో ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టాప్లోకి దూసుకొచ్చింది. మొత్తం 4 పాయింట్లతో అగ్ర స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్తో మ్యాచ్ ముందు వరకూ మూడో స్థానంలో ఉన్న ముంబై టాప్లోకి ఎగబాకగా.. అగ్ర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానానికి పడిపోయింది. 3, 4 స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధించనున్నాయి.