
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. క్యాష్ రిచ్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టగా.. ఇంగ్లండ్ సిరీసులో పాల్గొన్న భారత ప్లేయర్స్ అందరూ ఆదివారం దుబాయ్ చేరుకుని క్వారంటైన్ అయ్యారు. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఇక సెప్టెంబర్ 20న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడనుంది. కేకేఆర్తో జరగనున్న మ్యాచులో ఆర్సీబీ జెర్సీ మారనుంది.
సెప్టెంబర్ 20న కోల్కతా నైట్ రైడర్స్తో జరుగనున్న మ్యాచ్లో రెడ్ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధరించనున్నది. ఈ విషయాన్ని ఆర్సీబీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో విలువైన సేవలను అందించిన ఫ్రంట్లైన్ వారియర్స్కు మద్దతుగా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. 'కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు.. ఫ్రంట్లైన్ యోధులు ధరించే పీపీఈ కిట్ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం' అని ఆర్సీబీ తన ట్విట్టర్లో పేర్కొంది.
'ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. గత వారం ఈ విషయం గురించి చర్చించాం. ఈ క్లిష్ట సమయంలో గ్రౌండ్ లెవల్లోని ఫ్రంట్లైన్ కార్మికులకు ఎలా సహాయపడవచ్చనే దానిపై చర్చించి వారికి మద్దతుగా నిలిచేందుకు బ్లూ జెర్సీని ధరించాలని నిర్ణయించాం. ఈ పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫ్రంట్లైన్ కార్మికులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఎంత పొగిడినా తక్కువే' అని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పారు. కోహ్లీ వ్యక్తిగతంగా కూడా దేశ ప్రజలకు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మహమ్మారిపై అవగాహన కూడా పెంచాడు.
ఐపీఎల్ 2021 ఫేజ్-1 సమయంలో కూడా మే 3న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే మ్యాచ్లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రకటించింది. కాని కరోనా వైరస్ కారణంగా టోర్నమెంట్ నిలిపివేయడంతో.. అప్పటి మాటను ఆర్సీబీ ఇప్పుడు నిలబెట్టుకుంటున్నది. కరోనాతో ఇబ్బందిపడుతున్న బెంగుళూరు మరియు ఇతర నగరాలకు 100 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇస్తామని అప్పట్లో ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్ 2021 ఆగిపోయేవరకు వరకు ఆర్సీబీ ఏడు మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.