చెన్నై: లక్ష్య ఛేదనలో తాను బంతిని అందుకొన్నప్పుడు చాలా ఒత్తిడి నెలకొందని ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ రాహుల్ చహర్ అన్నాడు. సామర్థ్యంపై నమ్మకం, రోహిత్ శర్మ తనపై చూపిన విశ్వాసంతో రాణించానని తెలిపాడు. టాపార్డర్ రాణించినా మిడిల్ ముంచడంతో భారీ స్కోరు చేయలేకపోయిన ముంబై.. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయినా ఆఖర్లో విజృంభించి సీజన్లో బోణీ కొట్టింది. మంగళవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచులో ఆఖర్లో బౌలర్లు సత్తాచాటడంతో ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాహుల్ చహర్ తన కోటా నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహర్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా చహర్ మాట్లాడుతూ... 'లక్ష్య ఛేదనలో కోల్కతాకు శుభారంభం దక్కడంతో మాపై ఒత్తిడి నెలకొంది. స్పిన్నర్లు రాణిస్తారని మాత్రం తెలుసు. రాహుల్ త్రిపాఠి వికెట్ను నేను ఆస్వాదించాను. రెండు మూడేళ్లుగా ఐపీఎల్ టోర్నీ ఆడుతుండటంతో నా సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నా' అని అన్నాడు.
KKR vs MI: ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు.. ఈ విజయం బౌలర్లదే: రోహిత్
'శుబ్మాన్ గిల్ ప్రతి బంతినీ సిక్సర్గా బాదడని తెలుసు. 90 కి.మీ వేగంతో బంతులు విసరడం నా బలం. నితీశ్ రాణా ముందుకొచ్చి ఆడుతున్న సంగతిని గమనించాను. అందుకే నా స్పెల్లో ఆఖరి బంతిని ఆఫ్సైడ్ ఫ్లిప్పర్గా వేశాను. అది ఫలించింది. కొన్నిసార్లు నా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ రోహిత్ భాయ్ నాపై నమ్మకం ఉంచి ప్రోత్సహించాడు. ఐపీఎల్ లేనప్పుడూ ముంబై తన ఆటగాళ్లను బాగా చూసుకుంటుంది. అదే దాని ప్రత్యేకత' అని ముంబై స్పిన్నర్ చహర్ చెప్పాడు.
'మ్యాచును ఇలా ముగించడం చాలా సంతోషం. ఆఖరి వరకు నమ్మకంతో ఉండటం ఎంత ముఖ్యమో తెలిసింది. చివరి నాలుగు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాం. జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆండ్రీ రసెల్ క్యాచ్ను జారవిడిచినందుకు అతడు నిరాశపడ్డాడు. కానీ మేం ఆటలో తిరిగి పుంజుకొనేందుకు అతడే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మా స్పిన్నర్లకు ఎంతో అనుభవం ఉంది. వాళ్లు పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఇలాంటి వికెట్లపై ఆడటం సులభం కాదు. ఆఖర్లో రెండు మూడు వికెట్లు తీస్తే గెలుస్తామని అనిపించింది' అని ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేర్కొన్నాడు.