బట్లర్ ఒక్కడే:
189 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టుకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ మనన్ వోహ్రా (14) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన సంజు శాంసన్ (1), శివమ్ దూబే (17), డేవిడ్ మిల్లర్ (2), రియాన్ పరాగ్ (3), క్రిస్ మోరీస్ (0)లు చెన్నై స్పిన్నర్ల దెబ్బకి పెవిలియన్కి క్యూ కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బట్లర్ ఒక్కడే పోరాడాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన జడేజా మొదటి బంతికి బట్లర్.. ఆఖరి బంతికి దూబేని ఔట్ చేసి మ్యాచ్ని చెన్నై వైపు మలుపు తిప్పాడు.
అలీ మాయ:
13వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ.. మిల్లర్ని ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో అలీ మళ్లీ మాయ చేశాడు. బంతి వ్యవధిలోనే పరాగ్, మోరీస్లను ఔట్ చేసేశాడు. దాంతో 8 పరుగుల వ్యవధిలోనే 5 కీలక వికెట్లు చేజార్చుకున్న రాజస్థాన్ మ్యాచ్లపై ఆశలు వదిలేసింది. ఉనద్కత్ (24; 17 బంతుల్లో), తెవాతియా(20; 15 బంతుల్లో) ధాటిగా ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో ధోనీసేన 45 పరుగుల తేడాతో గెలుపొందడమే కాకుండా ఈ టోర్నీలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
డుప్లెసిస్ మెరుపులు:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి శుభారంభం లభించలేదు. చెన్నై ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ఆడారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన నాలుగో ఓవర్లో యువ ఓపెనర్ గైక్వాడ్ ఔటయ్యాడు. దీంతో 25 పరుగులకు చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ వేసిన ఐదో ఓవర్లో డుప్లెసిస్ (33: 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)చెలరేగాడు. 4, 4, 6, 4 బాది మొత్తంగా 19 పరుగులు రాబట్టాడు. మోరీస్ వేసిన తర్వాతి ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు యత్నించిన డుప్లెసిస్.. బౌండరీ లైన్ వద్ద పరాగ్ చేతికి చిక్కాడు. ఈ సమయంలో మొయిన్ అలీ (26: 20 బంతుల్లో 1 ఫోర్, 2 ఫోర్లు) కాసేపు దూకుడుగా ఆడి రన్రేట్ పడిపోకుండా చూశాడు. హిట్టింగ్ చేస్తున్న అలీని తెవాటియా ఓ అద్భుత బంతితో ఔట్ చేశాడు. దీంతో బ్యాటింగ్ భారం అంబటి రాయుడు, సురేష్ రైనాలపై పడింది.
ఆదుకున్న బ్రావో:
పరాగ్ వేసిన 11వ ఓవర్లో రాయుడు (27: 17 బంతుల్లో 3 సిక్సర్లు) , రైనా (18) చెరో సిక్స్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. తెవాటియా వేసిన ఆ తర్వాతి ఓవర్లో రాయుడు వరుసగా రెండు సిక్సర్లు బాది 14 రన్స్ పిండుకున్నాడు. దీంతో 12 ఓవర్లకే చెన్నై స్కోరు 100 దాటింది. అయితే సకారియా వేసిన 14వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన రాయుడు పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో రైనా కూడా మోరీస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో ధోనీ, రవీంద్ర జడేజా పెద్దగా రన్స్ రాబట్టలేకపోయారు. ఆఖర్లో డ్వేన్ బ్రావో (20 నాటౌట్) తమదైన శైలిలో రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో చెన్నై 188 పరుగుల భారీ స్కోర్ చేసింది.