మూడున్నర నెలలే సమయం
ఐపీఎల్ 2021లో ఒకటి లేక రెండు జట్లను అదనంగా చేర్చబోతున్నట్టు ఇటీవలి కాలంలో జోరుగా కథనాలు వినిపించాయి. కానీ హడావిడిగా కొత్త జట్లను చేర్చే ప్రయత్నాలను ప్రస్తుత ఫ్రాంచైజీలలో చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయట. మరో రెండు జట్లని టోర్నీలోకి ఆహ్వానిస్తే? అప్పుడు ఆటగాళ్ల కోసం మెగా వేలం ఆవశ్యంకానుంది. అంతేకాదు బ్రాడ్కాస్టర్ హక్కులు, స్ఫాన్సర్షిప్కి సంబంధించిన ఒప్పందాలని కూడా సవరించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరిగే లీగ్ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్కు ఇంకో మూడున్నర నెలలే సమయం ఉన్నందున కొత్త జట్లను చేర్చడం సాధ్యం కాదని భావిస్తోందట.
8 జట్లతోనే ఐపీఎల్ 2021
2022 నుంచి పది జట్లతో ఐపీఎల్ను జరపాలని బోర్డు భావిస్తోంది. ఈనెల 24న అహ్మదాబాద్లో జరిగే బోర్డు ఏజీఎంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారు. గురువారం బీసీసీఐ వార్షిక సమావేశం జరగనుండగా.. ఈ మీటింగ్ తర్వాత అధికారికంగా ఐపీఎల్ 2021 సీజన్లో ఆడే జట్ల సంఖ్యపై బీసీసీఐ ఓ ప్రకటనని విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 8 జట్లతోనే ఆడించి.. 2022 సీజన్ని మాత్రం 10 జట్లతో ఆడించే అవకాశాల్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
హడావిడిగా చేపట్టలేం
'కొత్త జట్లను చేర్చేందుకు ఇది తగిన సమయం కాదు. ఆటగాళ్ల భారీ వేలాన్ని కూడా హడావిడిగా చేపట్టలేం. 10 జట్లు.. 94 మ్యాచ్లంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. ఇక స్టార్ గ్రూప్తో ప్రసార ఒప్పందం కూడా 2021తో ముగుస్తుంది. ఆ తర్వాతే రెండు జట్లను చేరిస్తే ఎక్కువ మొత్తానికి బ్రాడ్కాస్ట్ హక్కులతో పాటు ఇతర వాణిజ్య ఒప్పందాలను కూడా కుదుర్చుకోవచ్చు. పూర్తి విషయాలు ఏజీఎంలో చర్చించాక తెలుస్తాయి' అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఫ్రాంచైజీ కొనుగోలుపై ఆసక్తి
కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ నుంచి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నాడు. అలాగే అతడికి ఆర్పీఎస్జీ కంపెనీ చైర్మన్ సంజీవ్ గోయెంకా గట్టి పోటీ ఇస్తున్నాడు. గతంలో రెండేళ్ల పాటు రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ పేరిట ఫ్రాంచైజీని నిర్వహించిన అనుభవం కూడా గోయెంకాకు ఉంది. హీరో మోహన్ లాల్ కూడా కొత్త జట్టుపై ఆసక్తిగా ఉన్నాడు. ఇక బీసీసీఐ కూడా కొత్త జట్ల కోసం ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో టెండర్లను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.
ఆరు నెలలు లేటుగా
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఆదరణ, ఆదాయం విషయంలో మరే క్రికెట్ టోర్నీ కూడా పోటీపడలేనంతగా ఐపీఎల్ ఎదిగింది. మధ్యలో కొన్ని జట్ల చేరిక, తొలగింపు లాంటివి జరిగినా.. 8 జట్లతో సీజన్ బాగా క్లిక్ అయ్యింది. ప్రతిఏటా సమ్మర్ సీజన్లో అభిమానులను అలరించే ఈ మెగా టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఆరు నెలలు లేటుగా జరిగింది. అయినా సూపర్ హిట్ అయింది. ఐపీఎల్ 2021ని ఎప్పటిలాగే మార్చి-ఏప్రిల్ మాసంలో మొదలెట్టేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
'గెలిచే ఏకైక అవకాశం పోయింది.. ఇక టీమిండియా పుంజుకోవడం కష్టం'