గర్జించిన గబ్బర్:
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓవర్లోనే యువ ఓపెనర్ పృథ్వీ షా (7) వికెట్ కోల్పోయింది. జయంత్ యాదవ్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. మరో వికెట్ పడకుండా స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్ జాగ్రత్తగా ఆడారు. సింగిల్స్ తీస్తూనే.. చెత్త బంతులను బౌండరీలు పంపిస్తూ ఇన్నింగ్స్ను ముందుకునడిపారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 10వ ఓవర్ రెండో బంతికి స్మిత్ను పొలార్డ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ 64 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
పొలార్డ్ నోబాల్:
లలిత్ యాదవ్ అండతో శిఖర్ ధావన్ మూడో వికెట్కు 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రాహుల్ చహర్ వేసిన 14వ ఓవర్ ఐదవ బంతికి గబ్బర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మరికొద్ది సేపటికే కెప్టెన్ రిషబ్ పంత్ (7)ను బుమ్రా వెనక్కిపంపాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా యాదవ్ మాత్రం చక్కగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా, బౌల్ట్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో హెట్మెయర్ కూడా తన శైలికి బిన్నంగా ఆడాడు. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 5 రన్స్ అవసరం కాగా.. పొలార్డ్ వేసిన మొదటి బంతికి హెట్మెయర్ బౌండరీ బాదాడు. ఆపై పొలార్డ్ నోబాల్ వేయడంతో ఢిల్లీ విజయం సాధించింది.
రోహిత్ జోరు:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. రోహిత్ సేనకు శుభారంభం దక్కలేదు. మార్కస్ స్టాయినీస్ వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (1) ఔట్ అయ్యాడు. ఈ దశలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ రోహిత్ శర్మ (44, 30 బంతుల్లో 3x4, 3x 6)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (24) జోరుగా బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్ ఆర్ అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో సూర్య ఒక ఫోర్ బాదగా.. రోహిత్ 4, 6 కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఆపై కాగిసో రబాడ బౌలింగ్లోనూ 14 రన్స్ రాబట్టారు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి ముంబై ఒక వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది.
మిశ్రా మణికట్టు మాయాజాలం:
రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుండటంతో ముంబై భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ సమయంలో బౌలింగ్కు దిగిన వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 9వ ఓవర్లో రోహిత్, హార్దిక్ పాండ్యా (0)ను ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యా (1)ను లలిత్ యాదవ్ ఔట్ చేయగా.. కీరన్ పొలార్డ్ (2)ను మిశ్రా వెనక్కి పంపాడు. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జయంత్ యాదవ్ (23), ఇషాన్ కిషన్ (26) ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో నిలకడగా ఆడుతున్న ఇషాన్ను మిశ్రా పెవిలియన్ పంపడంతో కనీసం ముంబై 150 మార్క్ కూడా అందుకోలేకపోయింది. మిశ్రా దెబ్బకు మెరుపులు లేకుండానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది.