అహ్మదాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సక్సెస్ఫుల్ బౌలర్లలో ఒకడైన అమిత్ మిశ్రా ఒక తప్పిదం చేశాడు. మిశ్రా అలవాటులో పొరబాటున బంతికి ఉమ్మి రాశాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్లో ఈ ఘటన వెలుగు చూసింది. దీన్ని ఘటన చూసిన అంపైర్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు.
కరోనా వైరస్ మహమ్మారి భయంతో గతేడాది నుంచి బంతికి ఉమ్మి రాయడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధించిన విషయం తెలిసిందే. బంతిపై ఉమ్మి రాయడంపై ఐసీసీ నిషేధం విధించి చాలా కాలమవుతున్నా.. ఆటగాళ్లు మాత్రం ఆ అలవాటుకు దూరం కాలేకపోతున్నారు. బెంగళూరుతో మ్యాచ్లో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసేందుకు వచ్చిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. తొలి బంతి వేయడానికి ముందు బంతిపై ఉమ్మి రాసాడు. దీన్ని చూసిన అంపైర్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు.
— pant shirt fc (@pant_fc) April 27, 2021
అమిత్ మిశ్రాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు కూడా ఫీల్డ్ అంపైర్ హెచ్చరిక జారీ చేశాడు. ఆపై బంతిని శానిటైజ్ చేసి ఆటను కొనసాగించారు. మొదటిసారి అంపైర్ హెచ్చరించినా ఉమ్మి నిబంధనను ఏదైనా బౌలర్ ఉల్లంఘిస్తే.. ఆ జట్టుపై ఐదు పరుగుల పెనాల్టీ పడుతుంది. ఈ మ్యాచులో మిశ్రా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కీలక సమయంలో గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్లో మ్యాక్స్వెల్ను అవుట్ చేయడం ఇది ఐదవసారి.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్లాడి 170 వికెట్లు తీయగా.. మిశ్రా 154 మ్యాచ్లాడి 166 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మిశ్రా ఈ రికార్డును అతి త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది. మిశ్రా భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.