వాట్సన్ స్థానాన్ని భర్తీ చేసుకోవాలి:
ఆటకు వీడ్కోలు పలికిన షేన్ వాట్సన్, వయసు మీద పడుతున్న డ్వేన్ బ్రావో స్థానాలను భర్తీచేయగల ఆటగాళ్లను చెన్నై సూపర్కింగ్స్ కొనుగోలు చేయాల్సి ఉందని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరిగే వేలం చిన్నదే కాబట్టి ఎక్కువ మందిని తీసుకోకూడదని సూచించారు. సురేశ్ రైనా జట్టులోకి రావడంతో చెన్నై మళ్లీ బలంగా మారిందన్నారు. 'చెన్నై ముందుగా షేన్ వాట్సన్ స్థానాన్ని భర్తీ చేసుకోవాలి. మంచి ఓపెనర్ కోసం పోటీపడాలి. గతేడాది సురేశ్ రైనా లేడు. ఈసారి అందుబాటులో ఉంటాడు కాబట్టి చెన్నై బలం పెరుగుతుంది. ఐపీఎల్ భారత్లో జరగనుంది కాబట్టి ధోనీ జట్టులో కొన్ని మార్పులు చేసేందుకు ఆస్కారం ఉంది' అని గౌతీ అన్నారు.
అలీ గొప్ప టీ20 ఆటగాడు:
'చెపాక్ మందకొడి పిచ్. బంతి ఎక్కువగా టర్న్ అవుతుంది. అందుకే ఎంఎస్ ధోనీ ఇక్కడ సుదీర్ఘంగా ఆడగలుగుతున్నాడు. సీనియర్ హర్భజన్ సింగ్ను చెన్నై వేలంలోకి విడుదల చేయడంతో ఈసారి ఒక ఆఫ్ స్పిన్నర్ను తీసుకోవచ్చు. ఈ స్థానం కోసం ఒక ఆల్రౌండర్ను ఎంపిక చేసుకోవచ్చు. కర్న్ శర్మ, ఇమ్రాన్ తాహిర్ రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు.. రవీంద్ర జడేజా, సాయి కిషోర్, మిచెల్ సాంట్నర్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్లు జట్టులో ఉన్నారు. భజ్జి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అలీ రెండు విధాలుగా పనికొస్తాడు. తొలి ఓవర్ (కొత్త బంతితో) బౌలింగ్ చేయగలడు.. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు. అలీ గొప్ప టీ20 ఆటగాడు' అని మంగళవారం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో పేర్కొన్నారు.
ఓపెనింగ్ కూడా చేయగలడు:
'ఎంఎస్ ధోనీ ఎక్కువగా ఆఫ్ స్పిన్నర్లను ఇష్టపడతాడు. మొదటిలో రవిచంద్రన్ అశ్విన్.. ఆ తర్వాత హర్భజన్ సింగ్ జట్టులో ఉన్నారు. ఇప్పడు మొయిన్ అలీని తీసుకుంటే సరిపోతుంది. జట్టుకు అన్ని విధాలుగా పనికొస్తాడు. అలీని తీసుకుంటే.. మహీ కచ్చితంగా సంతోషంగా ఉంటాడు. క్రిష్ణప్ప గౌతమ్ కూడా మంచి ఆప్షన్. కానీ అలీ సీనియర్ ఆటగాడు. ఫాఫ్ డు ప్లెసిస్తో కలిసి ఓపెనింగ్ కూడా చేయగలడు' అని గౌతీ సూచించారు. సాధారణంగా చెన్నైకి ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఓపెనింగ్ చేస్తారు కాబట్టి మరో బ్యాటర్ను కూడా తీసుకోవచ్చన్నారు.
సమూల మార్పులు ఉంటాయనుకోను:
ఈ సీజన్లో వేలం చిన్నదే కాబట్టి జట్టును తక్కువ మందికే పరిమితం చేయాలని గంభీర్ సూచించారు. 'ఈ సీజన్ తర్వాత భారీ వేలం జరుగుతుంది. అందుకే చెన్నైలో సమూల మార్పులు ఉంటాయని అనుకోను. ఈసారి సురేశ్ రైనా రావడం ఆ జట్టుకు భారీ ఊరట. ఎందుకంటే అతడు టీ20 క్రికెట్ బాగా ఆడతాడు. చెన్నైకి ఎన్నో విజయాలు అందించాడు. అదే సమయంలో వారికి కొత్త ఆటగాళ్లూ వస్తారు. కొత్తవాళ్లు వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త బలం తెస్తారు. వీటి కోసమే ఆ జట్టు చూస్తుందని అనుకుంటున్నా' అని బీజేపీ ఎంపీ గంభీర్ అన్నారు.
India vs England: జాఫర్ అదిరే పంచ్.. టీమిండియా విజయాన్ని ఎగతాళి చేసిన పీటర్సన్కు మైండ్బ్లాక్!!