చరిత్రలో తొలిసారి:
ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్కింగ్స్ నిలిచింది.ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ఆటలో గెలుపోటములు సహజమని, కొన్ని మ్యాచ్ల్లో గెలవొచ్చు.. కొన్నింట్లో ఓడొచ్చని, తన దృష్టిలో సీఎస్కే ఎప్పుడూ విన్నరే అంటూ ఇన్స్టాగ్రామ్లో సాక్షి పోస్టు చేశారు. భారమైన హృదయంతో సాక్షి భావోద్వేగం చెందారు. ఇలా ఆమె చెన్నై సూపర్ కింగ్స్కు ఆమె మద్దతుగా నిలిచారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కేవలం ఆట మాత్రమే:
'ఇది కేవలం ఆట మాత్రమే. కొన్నింటిలో గెలుస్తారు.. మరికొన్నింటిలో ఓడిపోతారు.. ఇంకొన్నింటిని చేజార్చుకుంటారు. అద్వితీయమైన విజయాలు, కొన్ని ఓటములు. వాటి వల్ల కొందరికి సంతోషాలు కలిగాయి.. మరికొందరికి వేదన మిగిల్చాయి. ఏదేమైనా ఇది కేవలం ఆట మాత్రమే. ఇందుకు బదులుగా విభిన్న రకాల స్పందనలు!!. భావోద్వేగాలను, క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనుమతినివ్వకూడదు. ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు, అయితే అందరూ విజేతలు కాలేరు' అని సాక్షి పోస్ట్ చేశారు.
అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ కింగ్స్గానే:
'మైదానాన్ని వీడే సమయంలో వినకూడని శబ్దాలు, చూడకూడని సైగలు, మనోబలంతో వాటిపై పైచేయి సాధించాలి. ఇది కేవలం ఆట మాత్రమే!!. మీరు అప్పుడు విజేతలే, ఇప్పుడు కూడా విజేతలే, ఎప్పటికీ విజేతలే!. నిజమైన యోధులు యుద్ధం చేయడం కోసమే పుడతారు.. వాళ్లు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ కింగ్స్గానే ఉంటారు' అని సాక్షి ధోనీ చెన్నై జట్టుకు మద్దతుగా నిలిచారు. చెన్నై ఆడబోయే రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి.. పరువు కాపాడుకోవడం మాత్రమే చెన్నై చేయగలిగే పని.
|
మిశ్రమ స్పందనలు:
సాక్షి ధోనీ పోస్టు పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. గతంలో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్ పేలవ ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, బెంగళూరు తలో 14 పాయింట్లతో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానాల్లో కోల్కతా 12, పంజాబ్ 10 పాయింట్లతో కొనసాగుతున్నాయి. మరోవైపు చెన్నై ప్రస్తుతం 12 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతుంది. మిగతా రెండు మ్యాచ్ల్లో గెలిచినా చెన్నై మొత్తం 12 పాయింట్లే సాధిస్తుంది.