పాంటింగ్ నుంచి నేర్చుకున్నా:
ఇండియా టూడే నిర్వహించిన ఫస్ట్ ఎపిసోడ్ ఇన్సిపిరేషన్ సీజన్-2లో రోహిత్ శర్మ మాట్లాడుతూ... తాను కెప్టెన్సీలో రాటుదేలడానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగే కారణమని చెప్పాడు. 'ప్రతీ ఒక్క ఆటగాడి నుంచి ఏ విధంగా ప్రదర్శన రాబట్టాలనే విషయం పాంటింగ్ వద్ద నుంచి నేర్చుకున్నా. జట్టులో ఉన్న అందరి ఆటగాళ్ల నుంచి సహకారం పొందేలా చూస్తాను. గెలుపులో వారితో పాటు నా ప్రదర్శన కూడా ముఖ్యమే. అయితే తుది జట్టులో నాతో ఆడే పది మందితో పాటు బెంచ్ మీద ఉన్న ఇతర ఆటగాళ్లతో కూడా మాట్లాడతాను. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రాముఖ్యత ఇస్తాను. ఈ విషయాన్ని రికీ పాంటింగ్ నుంచి నేర్చుకున్నా' అని రోహిత్ తెలిపాడు
మొదటి విషయం అదే:
'రికీ పాంటింగ్ నాకు చెప్పిన మొదటి విషయం ఏంటంటే.. ఆటగాళ్లు మైదానంలో ఎలా చేయాలనుకుంటున్నారనే విషయాన్ని కెప్టెన్గా మనం ఆలోచించలేం. వాళ్ల అభిప్రాయాలను ముందుగా వినాలి. తర్వాత మన విధానంలో మార్పులు చేసి అండగా నిలవాలని చెప్పాడు. ముంబై తరఫున పాంటింగ్ ప్రాతినిధ్యం వహించినప్పుడు అతడి వద్ద నుంచి నేర్చుకున్న అత్యుత్తమ విషయం ఇదే'' అని రోహిత్ వెల్లడించాడు. ముంబై తరఫున రికీ పాంటింగ్ ఆటగాడిగా, కోచ్గా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. పాంటింగ్ నుంచి రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.
ఒత్తిడి ఉండకూడదు:
యువ ఆటగాళ్లు రాణించాలంటే వారిపై ఒత్తిడి ఉండకూడదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఒత్తిడి లేని సందర్భాల్లోనే వారి నుంచి ఉత్తమ ప్రదర్శన చూస్తామని తెలిపాడు. అంతేగాక జట్టులో వారి గురించి ఎక్కువగా మాట్లాడనప్పుడే సత్తా చాటుతుంటారని చెప్పాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన సారథిగా రికార్డు సాధించిన రోహిత్ ప్రస్తుత సీజన్లోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడినా.. కోల్కతాపై ఘన విజయం సాధించాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మన్గానూ రాణిస్తున్నాడు. కోల్కతాపై 80 పరుగులు బాదాడు.