|
పాముతో పోల్చడం పట్ల.. అంతే ఘాటుగా..
భజ్జీకి సొంత టీమ్ పట్ల, కేప్టెన్ పట్ల ఏ మాత్రం అతనికి అభిమానం లేదని, జట్టులోకి తీసుకుని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ తప్పు చేసిందంటూ అభిమానులు కామెంట్స్ చేసిన మరుసటి రోజే.. అతను బరిలోకి దిగాడు. ట్విట్టర్ వేదికగా వారికి ఘాటుగా బదులు ఇచ్చాడు. ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులున అతను పందులతో పోల్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. తాజాగా అతను చేసిన ఈ వ్యాఖ్యలు ధోనీ ఫ్యాన్స్ను మరింత రెచ్చగొట్టినట్టయింది.
|
పందులతో ఫైట్ చేయలేం..
పందులతో ఫైట్ చేయలేమని, ఈ విషయాన్ని తాను చాలా రోజుల కిందటే నేర్చుకున్నానని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. పందులతో కుస్తీ పట్టడం వల్ల బురద తమకే అంటుకుంటుందని చెప్పుకొచ్చాడు. అలాంటి కుస్తీని పందులే ఇష్టపడతాయనీ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. తనను పాముతో పోల్చడం పట్ల అసహనానికి గురైనందు వల్లే హర్భజన్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అతను చేసిన ఈ వ్యాఖ్యలు ధోనీ, సీఎస్కే అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్యా ఓ మినీ యుద్ధమే నడుస్తోంది.
|
గొడవకు కారణం ఇదే..
సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ.. అంపైర్ శాసించిన ఉదంతంపై లాఫింగ్ ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడతను. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో వైడ్ సిగ్నల్ ఇవ్వడానికి అంపైర్ పాల్ రీఫెల ప్రయత్నించడం, అదే సమయంలో ఎంఎస్ ధోనీ ఆయనను అడ్డుకోవడం వంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో క్లిప్ను యాడ్ చేసి పోస్ట్ చేసిన ఓ ట్వీట్టర్ యూజర్కు హర్భజన్ సింగ్ లాఫింగ్ ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు. ఇది ధోనీ ఫ్యాన్స్కు నచ్చలేదు. వారికి మరింత మంటెక్కించినట్టయింది.
|
తాజా వ్యాఖ్యలపైనా ఫ్యాన్స్ భగ్గు..
దీనితో వారు హర్భజన్ సింగ్ను టార్గెట్గా చేసుకున్నారు. ఘాటు కామెంట్లతో హర్భజన్ సింగ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2018లో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ హర్భజన్ సింగ్ను అనవసరంగా జట్టులోకి తీసుకుందని మండిపడుతున్నారు. అతను పాములాంటోడని ఘాటు ఆరోపణలు సంధిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వారు చెన్నై సూపర్ కింగ్స్ను ఆశ్రయించారే తప్ప.. క్రికెట్పై ఉన్న ప్రేమతో కాదంటున్నారు. ఆ వ్యక్తిగత కారణాలతోనే జట్టు ప్రయోజనాలను కూడా కాదని టోర్నమెంట్ ఆరంభానికి ముందే వెళ్లిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. సురేష్ రైనా కూడా దీనికి మినహాయింపేమీ కాదని చెబుతున్నారు.