రోహిత్ డేవుడిని వేడుకోవాల్సిందే:
వీరేంద్ర సెహ్వాగ్ 'వీరు కీ బైటక్' పేరుతో ఒక చానెల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 13వ సీజన్కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తన చానెల్ ద్వారా రోజువారి ఎపిసోడ్లుగా విడుదల చేస్తున్నాడు. ఈరోజు మ్యాచ్ ఉండడంతో.. ఓ సెటైర్ వేశాడు వీరూ. 'దుబాయ్లో అందరూ చమురు కోసం భూమిని తవ్వుతుంటారు. ఈరోజు మ్యాచ్లో ముంబైపై గెలవాలంటే రాజస్థాన్ అంతకంటే లోతుగా తవ్వాల్సిన అవసరం ఉంది. ముంబై కూడా రాజస్థాన్ను ఓడించాలంటే.. రోహిత్ శర్మ ఆ డేవుడిని వేడుకోవాల్సిందే' అని సరదాగా పేర్కొన్నాడు. రాజస్థాన్తో ఆడిన గత నాలుగు మ్యాచుల్లో ముంబై ఓడిపోయింది. అందుకే వీరూ ఇలా అన్నాడు.
రాజస్థాన్ చేసిన పొరపాట్లే చేస్తోంది:
రాజస్తాన్ జట్టులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో విమర్శించాడు. రాజస్తాన్ ఆటగాళ్లు జయ్దేవ్ ఉనాద్కట్, రాబిన్ ఊతప్పలను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. కోట్టు పెట్టి వారిద్దరిని కొన్నందుకు ఆ జట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ చురకలంటించాడు. 'కోట్లు వెచ్చించి కొనుకున్న ఆటగాళ్ల ఎంపిక విషయంలో రాజస్థాన్ పదేపదే పొరపాట్లు చేస్తోంది. ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రభావం చూపించని ఉనాద్కట్కు మాత్రం జట్టులో స్థానం ఉంటోంది' అని అన్నాడు. ఈ సీజన్లో ఉనాద్కట్ చెత్త ఫామ్ను కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్లాడి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు.
మంచి స్కీమ్లా ఉంది:
'2018లో రాజస్థాన్ జట్టు జయ్దేవ్ ఉనాద్కట్ను రూ.11.5కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఆ తర్వాత 2019లో రూ.8.4కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత ఐపీఎల్ 2020లో రూ.3కోట్లకు మళ్లీ అతడినే తీసుకుంది. ఇదంతా చూస్తుంటే.. ఇదొక మంచి స్కీమ్లా కనిపిస్తోంది. దీన్ని బట్టి వచ్చే సీజన్లో ఉనాద్కట్కు డబ్బు చెల్లించడానికి బదులు.. ఆడినందుకు అతనే యాజమాన్యానికి తిరిగి డబ్బు కట్టాల్సి వచ్చేలా ఉంది' అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
వారితో జట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా?:
'కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు. బ్యాటింగ్లో కూడా రాజస్థాన్ జట్టు అవే తప్పులు పునరావృతం చేస్తోంది. రాబిన్ ఉతప్పను తీసుకోవడం.. బుల్లెట్ బైక్ కొనడానికి తీసుకెళ్లిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ లూనా కొన్నట్లు ఉంది. కోట్టు పెట్టి కొంటే వీరివల్ల జట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా?. ఏదేమైనా ఈ మ్యాచ్లో జయ్దేవ్ ఉనాద్కట్, ఉతప్ప కచ్చితంగా ఉంటారు. ఇక మ్యాచ్లో గెలవాలంటే రాజస్థాన్ ఆటగాళ్లు జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్ ముంబై జట్టుకు పెయింట్ వెయాల్సిందే' అని సెటైర్లు వేశాడు వీరూ.