దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసి.. ఢిల్లీ ముందు 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సూర్యకుమార్ యాదవ్ (51; 38 బంతుల్లో 6×4, 2×6), ఇషాన్ కిషన్ (55; 30 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్ చివరలో హార్దిక్ పాండ్యా (37; 14 బంతుల్లో 5×6) మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (40; 25 బంతుల్లో 5×4, 1×6) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. అన్రిచ్ నోర్జ్, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ను కట్టడి చేసేందుకు అశ్విన్ను పవర్ప్లేలో బౌలింగ్కు దించాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అనూహ్యంగా రోహిత్ డకౌట్ కావడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. వికెట్ పడినా డికాక్ మాత్రం తన జోరు కొనసాగించాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్.. డికాక్కు మంచి సహకారం అందించాడు. ఇద్దరూ చెలరేగడంతో ముంబై స్కోరు తగ్గలేదు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.
అయితే ధాటిగా ఆడే క్రమంలో డికాక్ ఔట్ అయ్యాడు. వికెట్ పడినా సూర్యకుమార్ భారీ షాట్లు ఆడుతూ అర్ధ శతకంతో చేశాడు. నోర్జ్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి ఫోర్ బాదిన సూర్యకుమార్ 36 బంతుల్లోనే హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. ముంబై ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న సమయంలో అన్రిచ్ నోర్జ్ .. సూర్య కుమార్ను పెవిలియన్కు పంపి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ డకౌటయ్యాడు. ఆర్ అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. కృనాల్ పాండ్యా (13) కూడా ఔట్ అవ్వడంతో ముంబై కష్టాలో పడింది.
ఆ సమయంలో ఢిల్లీ బౌలర్ల జోరు చూస్తే.. ముంబై సాధారణ స్కోరుకే పరిమితమవుతుంది అంతా భావించారు. కానీ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అందరి అంచనాలను పటాపంచలు చేశారు. దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. ఇషాన్ భారీ షాట్లతో ఆకట్టుకోగా.. హార్దిక్ కేవలం సిక్సర్లతోనే డీల్ చేశాడు. ఈ జోడి 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబై అనూహ్యంగా 200 పరుగుల మార్క్ అందుకుంది. చివరి బంతికి సిక్స్ బాదిన ఇషాన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ముంబైని కట్టడి చేశాడు. కీలక సమయాల్లో స్టార్ బ్యాట్స్మెన్ను ఔట్ చేసి స్కోరు వేగానికి బ్రేక్ వేశాడు. అయితే మిగతా బౌలర్లు నోర్జ్ (1/50), శామ్స్ (0/44) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.