అదిరే ఆరంభం.. కానీ
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(29), మయాంక్ అగర్వాల్(26) శుభారంభం అందించారు. ఫస్ట్ ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ రెండు ఫోర్లు కొట్టగా.. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ సిక్సర్తో బౌండరీల ఖాతా తెరిచాడు. ఇలా ఓవర్కు రెండు బౌండరీలు బాదడంతో పంజాబ్ రన్రేట్ దూసుకెళ్లింది. అయితే జోరు మీదున్న ఈ జోడీని లుంగి ఎంగిడి విడదీసాడు. మయాంక్ అగర్వాల్ను క్లీన్ బౌల్ట్ చేసి పంజాబ్కు గట్టి షాకిచ్చాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.
|
దెబ్బతీసిన ఎంగిడి..
కానీ పవర్ ప్లే అనంతరం పంజాబ్ కథ ఒక్కసారిగా మారిపోయింది. పరుగుల వేగం తగ్గడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రాహుల్ను ఎంగిడి బౌల్డ్ చేయగా.. నికోలస్ పూరన్(2)ను శార్దుల్ ఠాకుర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రిస్ గేల్(12) ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. 19 బంతులు ఆడిన గేల్ ఒక్క బౌండరీ బాదకపోవడం గమనార్హం. ఆడేవారిని నిలువనీకుండా... నిలిచిన వారిని ఆడనీకుండా చెన్నై బౌలర్లు చక్కగా కట్టడి చేశారు.
|
దీపక్ హుడా సూపర్ ఫిఫ్టీ..
మన్దీప్ సింగ్, దీపక్ హుడా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసినా.. జడేజా దెబ్బ కొట్టాడు. మన్దీప్(14)ను క్లీన్ బౌల్ట్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్(2) గైక్వాడ్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. అయితే చివర్లో మన్దీప్ సిక్సర్లతో విరుచుకుపడటంతో పంజాబ్ గౌరవ ప్రథమైన స్కోర్ చేయగలిగింది. ఎంగిడి వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన దీపక్ హుడా.. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో ఫోర్, సింగిల్తో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 120 పరుగులైనా చేస్తుందా? అన్న జట్టును దీపక్ హుడా.. అద్భుత ఆటతీరుతో మంచి స్కోర్ అందించాడు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ 58 పరుగులు చేయడం విశేషం.