దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. యువ విరాట్ కోహ్లీలా కనిపిస్తున్నాడు అని ఆ జట్టు ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన చెన్నై.. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ గెలిచి సగర్వంగా ఇంటిబాట పట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ధోనీసేన హ్యాట్రిక్ విజయంతో సీజన్ను ముగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 153 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, ఓ సిక్స్), ఫాఫ్ డుప్లెసిస్ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించడంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది.
రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2020 సీజన్ మొదట్లో తడబడినా తర్వాత సత్తాచాటాడు. టోర్ని ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి బారిన పడినా కలవరపడకుండా కోలుకుని జట్టుకు వెన్నుముఖగా మారాడు. 0, 5, 0, 65 నాటౌట్, 72, 62 నాటౌట్.. ఈ ఐపీఎల్లో రుతురాజ్ స్కోర్లు. ప్రతిభావంతుడైన ఈ యువ ఆటగాడు ఐపీఎల్లో సత్తా చాటగలడని లీగ్ ఆరంభంలో అంతా అంచనా వేశారు. చివరకు టోర్నీ ముగిసే సమయానికి దాన్ని నిజం చేశాడు.
మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల రుతురాజ్కు గత ఏడాదే చెన్నై జట్టులో చోటు లభించినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్లో బరిలోకి దిగి తొలి బంతికే స్టంపౌట్ అయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్లలో రెండు డకౌట్లతో అతని ఆటపై సందేహాలు రేగాయి. అయితే తర్వాతి మూడు ఇన్నింగ్స్లలో అతను సత్తా చూపించాడు. వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి చెన్నై ఆటగాడిగా నిలిచాడు. ఈ మూడు సార్లూ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన అతను, తమ జట్టు తరఫున అత్యధిక సగటుతో సీజన్ను ముగించడం విశేషం.
రుతురాజ్పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఎలా గెలిపించాలో చూపించాడని వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకున్నాడు. చెన్నై ఆటగాడు డుప్లెసిస్ కూడా అతడిని మెచ్చుకున్నాడు. 'ఐపీఎల్ 2020 నిరాశపరిచింది. కానీ మూడు విజయాలతో టోర్నీని ముగించడం కాస్త ఊరట. రుతురాజ్ గైక్వాడ్ యువ విరాట్ కోహ్లీలా కనిపిస్తున్నాడు. ఒత్తిడిలో కూడా బాగా ఆడుతున్నాడు. యువ ఆటగాళ్లలో ఉండాల్సిన లక్షణం ఇదే. అతడు అత్యుత్తమ స్థాయికి చేరుకుంటాడు' అని డుప్లెసిస్ అన్నాడు. తనలో చాలా క్రికెట్ మిగిలి ఉందని, కనీసం ఐదు సంవత్సరాలు క్రికెట్ ఆడుతానని పేర్కొన్నాడు.
KKR: 'కమిన్స్ సూపరో సూపర్.. రూ.15.5 కోట్లకు న్యాయం చేశాడు'