మరికొన్ని గంటల్లో హాట్ గేమింగ్ స్పోర్ట్ ఐపీఎల్ దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ ధనాధన్ క్రికెట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఆతురుతగా చూస్తుంటే ప్లేయర్స్ మాత్రం నెట్స్లో బిజీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక తొలిరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు ముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ప్రత్యర్థిలానే చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమకు మరో ప్రత్యర్థి అని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ను ప్రత్యేకించి చూడాల్సిన పనిలేదని రోహిత్ కామెంట్ చేశాడు. చైన్నై జట్టుతో ఆ సమయానికి ఎలా ఆడుతామనేదానిపైనే తమ ఆలోచనంత కేంద్రీకృతమై ఉందని ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదానిపైనే చర్చ జరుగుతోందని రోహిత్ అన్నాడు. రోహిత్ శర్మ మాట్లాడిన ఈ మాటలను వీడియో రూపంలో ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా రిలీజ్ చేసింది.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మాట్లాడాడు. ఐపీఎల్ మొత్తం జట్లలోనే రెండు ఫేవరెట్ జట్ల మధ్య పోటీ జరగబోతోందని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాడు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గబోమని వారి అంచనాలకు మించి శనివారం జరిగే ప్రారంభ మ్యాచ్లో సత్తాను చాటుతామని హార్థిక్ పాండ్య చెప్పాడు.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రాక్ రికార్డు చూసినట్లయితే ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో చెన్నైపై విజయం సాధించగా... చెన్నై జట్టు 11 సార్లు ముంబైపై విజయం సాధించింది. ఇప్పటి వరకు రెండు జట్లు 28 సార్లు తలపడ్డాయి. గతేడాది నాలుగు మ్యాచుల్లో చెన్నైతో ముంబై తలపడగా అన్ని మ్యాచుల్లో ముంబైదే పై చేయిగా నిలిచింది. అంతేకాదు ఫైనల్స్లో ఒక పరుగు తేడాతో చెన్నై పై ముంబై గెలుపొంది టైటిల్ విన్నర్గా నిలిచింది. సీఎస్కే పై ఎప్పుడూ ముంబైదే పైచేయిగా నిలిచిందని ముంబై ఇండియన్స్ చీఫ్ కోచ్ మహేలా జయవర్ధనే చెప్పారు. ఒక నాణ్యమైన జట్టు అత్యుత్తమమైన జట్టుతో తలపడుతున్నామంటే మన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించాల్సి ఉంటుందని.. ముంబై ఆటగాళ్లు అదే చేస్తారని కోచ్ మహేల చెప్పారు.