ఒకే ఓవర్లో అవుట్ చేయడమంటే మాటలా?
మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసే వారిద్దరినీ ఒకే ఓవర్లో పెవిలియన్ దారి పట్టించడం అంటే మాటలు కాదనే అనుకోవాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ లేదా.. ఏబీ డివిలియర్స్ను అవుట్ చేయడమే గొప్ప అని అనుకుంటే.. ఒకే ఓవర్లో వారిద్దరినీ బలి తీసుకోవడం ఇంకెంత గొప్పగా ఉంటుంది?. అది అద్భుతమే అవుతుంది. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అదే సన్నివేశం ఆవిష్కృతమైంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్లు ఒకే ఓవర్లో క్రీజును వదిలారు.
18వ ఓవర్లో..
రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్ 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహ్మద్ షమీ ఈ ఓవర్ను వేశాడు. తొలుత డివిలియర్స్ను ఆ తరువాత విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. 18వ ఓవర్ మూడో బంతిని ఫుల్ డెలివరీగా సంధించాడు షమీ. దాన్ని మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అనుకున్నట్టుగా అది బ్యాట్కు కనెక్ట్ కాలేకపోయింది. ఎక్స్ట్రా కవర్ దిశగా గాల్లోకి లేచిన ఆ బంతిని కింగ్స్ పంజాబ్ ఫీల్డర్ దీపక్ హుడా క్యాచ్ చేశాడు. ఈ మ్యాచ్లో అతను చేసిన స్కోరు..2.
రెండు పరుగులతో
అదే ఓవర్ అయిదో బంతికి విరాట్ కోహ్లీని బలి తీసుకున్నాడు షమీ. షమీ వేసిన షార్ట్ బాల్ను పొరపాటుగా అంచనా వేశాడు కోహ్లీ. అనుకున్న దాని కంటే కాస్త నెమ్మదిగా కదిలిన ఆ బంతిని ఆడటంలో తొందరపడ్డాడు. బంతి దగ్గరికి రాకముందే బ్యాట్ ఊపేశాడు. అది కాస్తా గ్లోవ్స్ను ముద్దాడుతూ రాహుల్ చేతుల్లో వాలింది. కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతంగా ఆ బాల్ను అందుకున్నాడు రాహుల్. రెండు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. 39 బంతుల్లో మూడు ఫోర్లతో 48 పరుగులు చేశాడతను. ఒకే ఓవర్లో ఆ ఇద్దరు బ్యాట్స్మెన్లు పెవిలియన్ దారి పట్టారు.
కోహ్లీ.. ఏబీ.. ఇలా ఎన్నిసార్లు అవుట్ అయ్యారంటే..
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. ఇలా ఒకే ఓవర్లో అవుట్ కావడం ఐపీఎల్లో ఇది కొత్తేమీ కాదు. షార్జా మ్యాచ్ను కూడా కలుపుకొంటే మొత్తం ఎనిమిది సార్లు వారు అవుట్ అయ్యారు. 2012లో జాక్వెస్ కల్లిస్ తొలిసారిగా.. వారిద్దరినీ ఒకే ఓవర్లో దొరకబుచ్చుకున్నాడు. 213లో ధవల్ కులకర్ణి, 2015లో ఆశీష్ నెహ్రా, 2016లో కృనాల్ పాండ్యా, అదే ఏడాది తిషార పెరీరా, 2018లో నితీష్ కోహ్లీ-ఏబీ జోడీని ఒకే ఓవర్లో విడదీశారు. గత ఏడాది సీజన్లో శ్రేయాస్ గోపాల్.. ఈ సారి మహ్మద్ షమీ వారిద్దరినీ వేరు చేశారు.