కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశం
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్-13 సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత్లో కరోనా కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు, మరోవైపు భారత్లోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్పై తుది నిర్ణయం తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఫ్రాంచైజీలు మంగళవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశం కానున్నాయి.
తుది నిర్ణయం రేపే
బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశంలోనే ఐపీఎల్ను మరికొంత కాలం వాయిదా వేయాలా లేక ఈ ఏడాదికి పూర్తిగా రద్దు చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ముంబైలోని బీసీసీఐ కార్యాలయం తాత్కాలికంగా మూసి వేయడం, హోటల్లోనూ సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. ఈ సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నిర్వహిస్తారు. ఈ సమావేశం అనంతరం ఐపీఎల్పై పూర్తి స్పష్టత రానుంది.
పూర్తిగా రద్దయితే
ఐపీఎల్ను కుదించి నిర్వహించాలని, ఒకవేళ వేసవి కాలంలో సాధ్యంకాకపోతే జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఏర్పాటు చేసే అంశాన్ని బీసీసీఐ పరిశీలించింది. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్లోపే ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్-2009ని దక్షిణాఫ్రికాలో 37 రోజులు నిర్వహించారు. ఇప్పుడూ పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని రోజులు విదేశాల్లో, కొన్ని రోజులు స్వదేశంలో నిర్వహించేందుకు యోచిస్తున్నారు. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ పూర్తిగా రద్దయితే బీసీసీఐ సుమారు రూ. 3500 కోట్లు నష్టపోయే అవకాశముంది.