వేలంలో 48 ఏళ్ల తాంబే
ఐపీఎల్-13వ సీజన్ కోసం ఈనెల 19న కోల్కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు 73 స్థానాల కోసం పోటీపడుతున్నారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. క్రికెట్పై ఉన్న ఇష్టంతో ఇతగాడు ఇంకా ఆడుతున్నాడు. కుర్రాళ్లను కాదని 48 ఏళ్ల తాంబేను ఫ్రాంఛైజీలు కొనుక్కుంటారో లేదో చూడాలి.
2013 సీజన్లో అరంగేట్రం
ఐపీఎల్లో ప్రవీణ్ తాంబే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసాడు. అప్పుడు రాజస్థాన్ కనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2016లో ఆడకపోయినప్పటికీ.. 2017 ఎడిషన్లో సన్రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఈసారి ఏ ఫ్రాంఛైజీ తీసుకుంటుందో చూడాలి.
14 ఏళ్ల నూర్ అహ్మద్
ప్రవీణ్ తాంబేతో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొననున్నారు. ఫవాద్ అహ్మద్ (38), యూసుఫ్ పఠాన్ (37), బెన్ లాలిన్ (37), జీవన్ మెండిస్ (37)లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యూసుఫ్ పఠాన్ గతంలో సన్రైజర్స్ తరపున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల నూర్ అహ్మద్ కూడా ఈ వేలంలో పాల్గొంటున్నాడు. దీంతో అతి పిన్న వయసులో వేలంలో పాల్గొంటున్న ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
332 మంది షార్ట్లిస్ట్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నా.. వేలం ప్రక్రియ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కోల్కతాలో జరుగుతుందని లీగ్ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. ఈ సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనడానికి మొత్తం 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది షార్ట్లిస్ట్ అయ్యారు. రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల నుంచి తాము కోరుకుంటున్న 332 మంది ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఫైనలైజ్ చేశాయి.