చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్
గత కొన్ని రోజులుగా ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్లోని చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా గురువారం వారితో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా జత కలిసింది. గురువారం ఫ్లడ్ లైట్ల వెలుతురులో రెండు జట్లు సాధన చేశాయి. ఈ సందర్భంగా ధోని, కోహ్లి ఆత్మీయంగా పలకరించుకున్నారు.
|
చెన్నైకి బయల్దేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కాగా, అంతకముందు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చెన్నైకి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం.. చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం రాత్రి 8 గంటలకి టోర్నీ తొలి మ్యాచ్లో బెంగళూరుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు నుంచి కోహ్లీసేన బయల్దేరి వెళ్లింది.
ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ
ఐపీఎల్లో ఇప్పటి వరకు పదకొండు సీజన్లు ముగియగా.. కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దీంతో ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్గా రాణిస్తున్నా.. కెప్టెన్గా జట్టుని విజయపథంలోకి నడిపించలేకపోతున్నాడు. దీనిపై రెండు రోజుల క్రితం గౌతమ్ గంభీర్ కూడా విమర్శలు గుప్పించాడు.
ఈ ఐపీఎల్ సీజన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీ
ఒక్క టైటిల్ గెలవకపోయినప్పటికీ ఆర్సీబీ యాజమాన్యం కోహ్లీని కెప్టెన్గా ఉంచడం నిజంగా అతడి అదృష్టమని గంభీర్ అన్న సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మహేంద్రసింగ్ ధోని మూడు సార్లు టైటిల్ను అందించగా.. ఇక, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ జట్టుని మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలబెట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.
సీఆర్ఫీఎఫ్ కుటుంబాలకు విరాళంగా సీఎస్కే తొలి మ్యాచ్ ఆదాయం
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో టికెట్ల అమ్మకాల ద్వారా లభించే ఆదాయాన్ని చెన్నై సూపర్ కింగ్స్.. పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన సీఆర్ఫీఎఫ్ కుటుంబాలకు విరాళంగా అందజేయనుంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఆరంభమైన తొమ్మిది గంటల్లోనే ముగియడం విశేషం. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ చెన్నై కెప్టెన్ ధోని చేతుల మీదుగా.. బాధిత కుటుంబాలకు చెక్ను అందజేస్తామని సీఎస్కే డైరెక్టర్ రాకేశ్ సింగ్ చెప్పాడు.