
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు కాగిసో రబడపై క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) ప్రత్యేక శ్రద్ద తీసుకొంటోంది. దక్షిణాఫ్రికా జట్టులో ప్రధాన బౌలర్ అవ్వడంతో ప్రపంచకప్ వరకు అతను కోలుకునే విధంగా సీఎస్ఏ చర్యలు చేపట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన రబడకు గాయం అయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
మే 30న ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రబడకు తగిన విశ్రాంతి అవసరం అని భావించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అతనిని వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. బోర్డు ఆదేశాల మేరకు రబడ స్వదేశానికి వెళ్లడంతో.. ఢిల్లీ కీలక ప్లే ఆఫ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు డాక్టర్ మొహమ్మద్ మూసాజీ.. రబడ గాయంపై స్పందించాడు.
'కాగిసో రబడపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాం. అతడు బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్నాడు. జట్టులో ప్రధాన బౌలర్ అవడంతో క్రికెట్ సౌతాఫ్రికా అతను త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకొంటోంది. రెండు మూడు వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్ వరకు రబడ పూర్తిగా కోలుకుంటాడు. జట్టులో ఆడతాడు' అని మూసాజీ ఆశాభావం వ్యక్తం చేసాడు.
మరో ఇతర ప్రధాన బౌలర్లు డేల్ స్టెయిన్, లుంగీ ఎంగిడిలు కూడా గాయాల బారిన పడ్డారు. ఐపీఎల్లో స్టెయిన్, శ్రీలంక సిరీస్లో లుంగీ ఎంగిడిలు గాయపడ్డారు. ఈ విషయమై మూసాజీ స్పందించారు. 'దక్షిణాఫ్రికా సెలెక్టర్లకు చాలా అవకాశాలు ఉన్నాయి. బెంచ్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు' అన్నారు. పీఎల్ సీజన్-12లో రబడ 12 మ్యాచ్లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు.