రనౌట్ విషయంలో అశ్విన్ అనైతికంగా
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్వార్న్, ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్స్టోక్స్, జేసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్ తదితరులు మన్కడింగ్ రనౌట్ విషయంలో అశ్విన్ అనైతికంగా వ్వవహారించాడని తీవ్ర విమర్శలు గుప్పించగా.. భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, కామెంటేటర్ హర్షాభోగ్లే మాత్రం అశ్విన్కి మద్దతు పలికారు. ఈ మన్కడింగ్ రనౌట్పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్ స్పందించాడు.
అశ్విన్ చేసిన పని సరైనదిగా అనిపించడం లేదు
"అశ్విన్ చేసిన పని సరైనదిగా అనిపించడం లేదు. ప్రపంచ క్రికెట్లో విజయవంతమైన స్థాయి వ్యక్తి అలా చేయకూడదు. అంతపెద్ద ఆటగాడు ఇంత చిన్న పని చేశాడు. కోహ్లీనే కాదు ఏ ఆటగాడు ఇలా చేసినా విమర్శించాల్సిందే. ఆటలో అలా జరిగి ఉండకూడదు. కానీ అక్కడ చోటుచేసుకుంది తప్పు కాదు. అశ్విన్ చేసింది సరైందే కావొచ్చు కానీ అలా చేయకుండా ఉండాల్సింది" అని అన్నాడు.
సచిన్ అలా చేయలేదు
"ఇది క్రీడాస్ఫూర్తి కాదు. గతంలో అందుకే సచిన్ అలా చేయలేదు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కపిల్ దేవ్ సైతం పీటర్ కిర్స్టన్ను రెండు సార్లు హెచ్చరించిన తర్వాతే ఔట్ చేశాడు. బట్లర్ను అశ్విన్ హెచ్చరించి ఉంటే బాగుండేది. ఇది ఐపీఎల్లో జరగడం మంచిదే. అదే వరల్డ్కప్లో చివరి బంతికి ఎవరైనా ఇలా చేస్తే ఎలాఉండేదో ఊహించండి" అని మదన్ లాల్ అన్నాడు.
1987 వన్డే వరల్డ్ కప్లో
ఈ సందర్భంగా 1987 వన్డే వరల్డ్ కప్లో చోటు చేసుకున్న మన్కడింగ్ సంఘటనను గుర్తు చేశాడు. లాహోర్ వేదికగా వెస్టిండీస్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో ఒక్క వికెట్ కావాలి. అదే పాక్ గెలవాలంటే మాత్రం 14 అవసరం. ఆఖరి ఓవర్ వేసేందుకు విండిస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ వచ్చాడు.
|
మొదటి రెండు బంతులకు చెరో పరుగు
క్రీజులో పాక్ ఆటగాళ్లు అబ్దుల్ ఖాదిర్, సలీం జాఫర్ క్రీజులో ఉన్నారు. మొదటి రెండు బంతులకు చెరో పరుగు చేయడంతో పాకిస్థాన్ విజయానికి ఆఖరి నాలుగు బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. అబ్దుల్ ఖాదిర్ మూడో బంతికి రెండు పరుగులు తీసి నాలుగో బంతిని సిక్స్గా మలిచాడు. అనంతరం ఐదో బంతికి మరో రెండు పరుగులు చేయగా చివరి బంతికి ఇక రెండు పరుగులు కావాల్సి ఉంది.
|
వికెట్ తీస్తే విజయం విండీస్దే
వికెట్ తీస్తే విండీస్ విజయం సాధిస్తుంది. ఆ సమయంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సలీం జాఫర్.. కౌర్ట్నీ బంతి విసరకముందే క్రీజు వదిలి వెలుపలికి వెళ్లాడు. దీంతో కౌర్ట్నీ బౌలింగ్ చేయడం ఆపి సలీం జాఫర్ను హెచ్చరించాడు. చివరి బంతికి రెండు పరుగులు చేసిన పాక్ ఆ మ్యాచ్లో గెలుపొంది సెమీస్కు వెళ్లింది. సలీంను ఔట్ చేసే అవకాశం వచ్చినా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన కోర్ట్నీ వాల్స్పై ప్రశంసలు కురిపంచారు.